టీడీపీ నేతల దౌర్జన్యం | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల దౌర్జన్యం

Published Mon, Feb 1 2021 10:27 AM

TDP MLC Btech Ravi Aides Destroy Groundnut Farm in YSR District - Sakshi

సింహాద్రిపురం : వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురం మండలం నంద్యాలపల్లె గ్రామానికి చెందిన శివరామిరెడ్డి అనే రైతు శనగ పంటను స్థానిక టీడీపీ నాయకులు దౌర్జన్యంగా దున్నేశారు. బాధితుడు పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన తెలుగుదేశం ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అనుచరులు వై.గోపాల్‌రెడ్డి, లోక్‌నాథ్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, విజయ్‌కుమార్‌రెడ్డి, కేశవవర్దన్‌రెడ్డిలు శివరామిరెడ్డి పొలాన్ని దౌర్జన్యంగా  తీసుకోవాలని తరచూ గొడవ సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు మూడు నెలల క్రితం బాధితుడి పొలంలో కొలతలు వేయనీయకుండా సర్వేయర్‌ను, తహసీల్దార్‌ మహబూబ్‌ బాషాను దౌర్జన్యంగా అడ్డుకున్నారు. దీనిపై అప్పట్లో బాధితుడు జమ్మలమడుగు ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు.(చదవండి: చిచ్చు పెట్టండి.. రచ్చ చేయండి)

ఈ భూమికి సంబంధించి టీడీపీ వర్గీయులు ఎలాంటి పత్రాలు చూపకపోవడంతో ఆర్డీఓ కూడా ఈ భూమి శివరామిరెడ్డికి సంబంధించినదే అని పేర్కొన్నారు. దీన్ని జీర్ణించుకోలేని ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అనుచరులు ఆదివారం బాధితుడి పొలంలోని శనగ పంటను రెండు ట్రాక్టర్లతో దున్నేశారు. మరో 20 రోజుల్లో పంట చేతికందే సమయంలో  దున్నేయడంతో రూ.2 లక్షల మేర నష్టం వచ్చినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. టీడీపీ నేతల దౌర్జన్యానికి ఇది పరాకాష్ట అని అతను వాపోయాడు. స్థానిక టీడీపీ నాయకులు ఎమ్మెల్సీ బీటెక్‌ రవి అండదండలతో తనను తరచూ ఏదో ఒక రకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 
 

Advertisement
Advertisement