CM YS Jagan Mohan to Have A Thankyou Meet With 1 lakh People- Sakshi
Sakshi News home page

లక్ష మందితో నవంబర్‌లో సీఎంకు కృతజ్ఞత సభ

Published Mon, Aug 23 2021 3:20 AM

Thanks Meet To CM Jagan With One Lakh People - Sakshi

సాక్షి, అమరావతి: నవంబర్‌లో లక్ష మందితో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని గ్రామ, వార్డు సచివాలయ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తీర్మానించినట్టు ఆ సంఘం గౌరవాధ్యక్షుడు, రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి చెప్పారు. విజయవాడ ఆర్టీసీ సమావేశ మందిరంలో ఆదివారం కార్యవర్గ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అక్టోబర్‌ రెండో తేదీ నాటికి సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని కోరిన వెంటనే సీఎం సానుకూలంగా స్పందించి అధికారులను ఆదేశించారని చెప్పారు. చదవండి: Andhra Pradesh: ఊరికి ఆరోగ్య రేఖ

తదనుగుణంగా ఆ ప్రక్రియ జరుగుతోందని, డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు ఉత్తీర్ణులైన ఉద్యోగులందరికీ ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేస్తారని తెలిపారు. ఉద్యోగులకు సంబంధించిన పలు అంశాలపై ప్రభుత్వానికి విన్నవించుకుంటూ పలు తీర్మానాలు చేశామన్నారు. డిపార్టుమెంటల్‌ టెస్ట్‌ లేని 8 శాఖలకు ఎటువంటి పరీక్షలు లేకుండా ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని, ప్రసూతి సెలవులో ఉన్న మహిళా ఉద్యోగుల సెలవు దినాలను పనిదినాలుగా పరిగణించి వారిక్కూడా ప్రొబేషన్‌ డిక్లేర్‌ చేయాలని కోరారు. స్లైడింగ్‌లో శాఖ మారిన ఉద్యోగుల మొత్తం సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. మహిళా పోలీసుల విషయంలో ఆప్షన్‌ ఇచ్చి వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని వెంకట్రామిరెడ్డి కోరారు.

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా అంజిరెడ్డి 
సమావేశంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్‌ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని 35 మందితో ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి, అధ్యక్షుడిగా భీమిరెడ్డి అంజిరెడ్డి, వర్కింగ్‌ అధ్యక్షులుగా నిఖిల్‌ కృష్ణ, సుధాకర్, భార్గవ్, ప్రధాన కార్యదర్శిగా బత్తుల అంకం రామారావు, అదనపు ప్రధాన కార్యదర్శిగా బీఆర్‌ఆర్‌ కిషోర్, ఉపాధ్యక్షులుగా పి.హరీష్, కిషోర్, బాజిని ఎన్నుకున్నారు.  చదవండి: వడివడిగా ‘ఈ పంట’ నమోదు

Advertisement
Advertisement