Sakshi News home page

మహిళా ఉద్యోగికి ఏఈ లైంగిక వేధింపులు.. బుద్ధి చెప్పిన కుటుంబ సభ్యులు

Published Wed, Nov 17 2021 11:23 AM

Visakhapatnam Chodavaram Electrical AE Molested Women Employee - Sakshi

విశాఖపట్నం/చోడవరం టౌన్‌: మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించడంతో ఆమె కుటుంబ సభ్యులు వచ్చి బాధిస్తున్న ఎలక్ట్రికల్‌ ఏఈకి బుద్ధి చెప్పారు. విశాఖ జిల్లా చోడవరం ఎలక్ట్రికల్‌ కార్యాలయంలో సబ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఒక దళిత మహిళను రెండు నెలలుగా అదే కార్యాలయంలో ఏఈగా విధులు నిర్వహిస్తున్న రామలింగేశ్వరరావు లైంగికంగా వేధిస్తున్నాడు. 

ఇది పద్ధతి కాదని నచ్చచెప్పినా ఇటీవల కాలంలో వేధింపులు ఎక్కువ కావడంతో ఆమె భర్తతో పాటు కుటుంబ సభ్యులకు సమస్యను తెలిపింది. దీంతో మంగళవారం మహిళా ఉద్యోగి భర్త, కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు చీడికాడ రోడ్డులోవున్న ఎలక్ట్రికల్‌ కార్యాలయానికి వచ్చి ఏఈ రామలింగేశ్వరరావుతో వాగ్వాదానికి దిగారు. 

ఈ సందర్భంగా ఏఈ వారికి క్షమాపణలు చెప్పారు. అనంతరం బాధిత ఉద్యోగి బంధువులు చోడవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే విద్యుత్‌ శాఖలో ఉన్నతాధికారులు రంగంలోకి దిగి మహిళా ఉద్యోగి కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులతో చర్చలు జరిపి కేసును రాజీ చేశారు. దీనిపై ఎస్సై విభూషణరావును వివరణ కోరగా ఈ కేసుపై బాధిత ఉద్యోగి నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement