World Travel And Tourism Council Focus New Virtual Technology - Sakshi
Sakshi News home page

కదలకుండా చుట్టిరావొచ్చు! ‘పర్యాటకం’లో వర్చువల్‌ విప్లవం

Published Tue, Jan 10 2023 9:24 AM

World Travel And Tourism Council Focus New Virtual Technology - Sakshi

సాక్షి, అమరావతి: పర్యాటక రంగంలో కూడా సాంకేతికత కీలకభూమిక పోషిస్తోంది. వర్చువల్, ఆగు­మెంటెడ్‌ రియాల్టీ (వీఆర్, ఏఆర్‌) సరికొత్త పర్యాట­క అనుభూతులను అందిస్తోంది. పర్యాటక ప్రదేశా­లతో పాటు మారుమూల ప్రాంతాల్లోనూ డిజిటల్‌ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వా­లు దృష్టిసా­రించాలని వరల్డ్‌ ట్రావెల్‌ అండ్‌ టూ­రిజం కౌ­న్సిల్‌ ప్రకటించడం సాంకేతికత అవస­రాని­కి ఊత­మిస్తోంది. దీనితో పాటు నేషనల్‌ డిజిట­ల్‌ టూ­రిజం మిషన్‌లో భాగంగా యునిఫైడ్‌ టూరి­జం ఇంటర్‌­ఫేస్‌ కోసం కేంద్ర పర్యాటక శాఖ కృషిచేస్తోంది.

ఈ క్రమంలోనే రాష్ట్ర పర్యాటక శాఖ ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ), గ్లోబల్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (జీఐ­ఎస్‌) వెబ్‌పోర్టల్, టూరిస్టు డెస్టినీ యా­ప్‌­లను రూ­పొం­దించేందుకు ప్రణాళికలు సిద్ధంచేస్తోం­ది. ఇప్ప­టి­కే ఏపీ మ్యూజియాల్లో వీఆర్, ఏఆర్‌­లు విశేష ఆద­రణ పొందుతున్నాయి. శిల్పా­రామాల్లో సైతం 12డి వర్చువల్‌ అనుభూ­తులను విస్తరిస్తున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశా­ల్లో లేజర్‌ షో, ప్రొజెక్షన్‌ మ్యాపింగ్‌లను కూడా అభివృద్ధి చేస్తోంది.

వర్చువల్‌ టూరిజం ఇలా..
వర్చువల్‌ టూర్లు కేవలం ఒకే స్థలంలో కూర్చోవడం ద్వారా పర్యాటకులు కోరుకునే ప్రదేశాలను చుట్టిరా­వచ్చు. దేశంలోని కళలు, సంస్కృతి, గొప్ప వారస­త్వ సంపద దృష్ట్యా వర్చువల్‌ టూరిజం అద్భు­తమైన వైవిధ్యాన్ని అందిస్తోంది. ఇక్కడ పర్యాట­కులు వీఆర్‌ కళ్లజోళ్లు ధరించి రిమోట్‌ కంట్రోల్‌ను ఉపయోగిస్తూ గమ్యస్థానాల్లో కలియదిరిగే అనుభూ­తిని పొందుతున్నారు.

వివిధ రాష్ట్రాల్లో ఇలా..
తమిళనాడు టూరిజం శాఖ వీఆర్‌ ఆధారిత బుక్‌లెట్ల ద్వారా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, వర్చువల్‌ రియాల్టీని అభివృద్ధి చేసి వెబ్‌సైట్‌లో సైతం అందుబాటులో ఉంచింది. 2016లో గుజరాత్‌ టూరిజం సింధు లోయలోని లోథాల్, ధోలవీర, రాణి–కి–వావ్‌తో సహా అనేక పురాతన ప్రదేశాలను 360 డిగ్రీల కోణంలో లైవ్‌ యాక్షన్‌ వీఆర్‌ వీడియోలను రూపొందించింది. 2021లో కేరళ టూరిజం శాఖ వర్చువల్‌ టూర్‌ గైడ్‌ కోసం ఏఆర్‌ యాప్‌ని తీసుకొచ్చింది. ఇది రాష్ట్రంలోని పర్యాటక ప్రదేశాలను కలుపుతూ రియల్‌ టైమ్‌ ఆడియో వీడియో గైడ్‌గా ప్రసిద్ధి చెందింది.

యాప్‌ సాయంతో..
నిత్యం పెరుగుతున్న పర్యాటక యాప్‌లతో ట్రావెల్, టూరిజం పరిశ్రమ పోటీపడాల్సి వస్తోంది. ఢిల్లీ టూరిజం శాఖ ‘దేఖో మేరే ఢిల్లీ’ యాప్‌.. అన్ని టికెట్ల బుకింగ్‌తో పాటు పర్యాటకులు ఒకే ప్లాట్‌ఫామ్‌లో సకల యాత్రలను ప్లాన్‌ చేసుకునే వీలుకల్పిస్తోంది. ప్రసిద్ధ వారసత్వ కట్టడాలను వైబ్‌సైట్‌ ద్వారా వర్చువల్‌ వాక్‌–త్రూలను అందిస్తోంది. మరోవైపు మ్యూజియాలు సైతం ఆన్‌లైన్‌ ప్రదర్శనలకు సిద్ధమవుతున్నాయి. 

(చదవండి: ఆక్వాకు ఉజ్వల భవిత..స్టేక్‌ హోల్డర్స్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు)

Advertisement

తప్పక చదవండి

Advertisement