పచ్చ పత్రికల దుష్ప్రచారం | Sakshi
Sakshi News home page

పచ్చ పత్రికల దుష్ప్రచారం

Published Wed, Jan 4 2023 4:04 AM

Yellow Media Fake News On CM Jagan Public Meeting - Sakshi

సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం/రాజమహేంద్రవరం రూరల్‌: ‘దున్నపోతు ఈనిందంటే.. దూడను కట్టేయండి’ అన్నట్టుగా ఉంది పచ్చ నేతలు, ఎల్లో మీడియా తీరు.   రాజమహేంద్రవరం రూరల్‌ శాటిలైట్‌ సిటీకి చెందిన అర్జి పార్వతి (65) కుక్క కాటు ఇంజక్షన్‌ రెండో డోస్‌ వేయించుకునేందుకు మంగళవారం ఉదయం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. తిరిగి ఇంటికి బయలు దేరుతుండగా రంగంపేట నుంచి రాజమహేంద్రవరం వైపు వస్తున్న ఏపీ29 జెడ్‌–355 నంబరు గల ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో గాయపడింది.

ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్‌ నూలు హరీష్‌ స్థానికుల సాయంతో తొలుత ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అయితే వలంటీర్‌.. 70 ఏళ్ల వృద్ధురాలిని బలవంతంగా సీఎం సభకు తీసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని.. సీఎం సభలో అపశ్రుతి.. అని పచ్చ మీడియా తప్పుడు ప్రచారం మొదలు పెట్టింది. టీడీపీ నేతలు నిమ్మకాయల చినరాజప్ప తదితరులు రాజమహేంద్రవరం ఆస్పత్రికి వెళ్లి ప్రభుత్వంపై బురదజల్లే యత్నం చేశారు. ఇంతలో వైద్య సేవలతో తేరుకున్న పార్వతి.. జరిగిన విషయాన్ని ఔట్‌ పోస్టు పోలీ­సులకు వెల్లడించింది. దీంతో ఎల్లో మీడియా, టీడీపీ నేతలు తేలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు.

టీడీపీ నేతలకు బుద్ధిరాదు: ఎంపీ భరత్‌
ప్రజలు ఎంతగా బుద్ధి చెప్పినా, టీడీపీ నేతలకు కనువిప్పు కలగడం లేదని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ చీఫ్‌ విప్, రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ మండిపడ్డారు. చంద్రబాబు సభల్లో ప్రమాదాలు జరుగుతున్నట్టే సీఎం సభల్లో కూడా జరగాలనే దుర్బుద్ధిని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. నగరంలో ఎక్కడో రోడ్డు ప్రమాదం జరిగితే దానిని సీఎం సభతో ముడిపెడుతున్నారంటే టీడీపీ చిల్లర, శవ రాజకీయం స్పష్టమవుతోందని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ఇప్పటికైనా నీచ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 

Advertisement
Advertisement