YSRCP Formation Day: ఘనంగా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు | Celebrations in AP - Sakshi
Sakshi News home page

పండుగలా వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ వేడుకలు

Published Fri, Mar 12 2021 9:36 AM

YSRCP 11th Formation Day Celebrations In AP - Sakshi

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ 11వ ఆవిర్భావ దినోత్సవాన్ని పండుగలా నిర్వహిస్తున్నారు. వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆశయాలు అంబరాన్ని తాకితే ప్రజాదరణే పునాదిగా నిలుస్తుందని వైఎస్సార్‌సీపీ నిరూపించింది. ఆకాంక్షల ఉన్నతికి జనాభిమానమే బ్రహ్మరథం పడుతుందని.. విశ్వసనీయత, విలువలకు విశ్వమే అండగా నిలుస్తుందని  చాటి చెప్పింది. ఈ సిద్ధాంతాలే ఊపిరిగా ప్రజా క్షేత్రంలో పురుడు పోసుకున్న వైఎస్సార్‌సీపీ నేడు 11వ వసంతంలోకి అడుగు పెట్టింది.

దేశ చరిత్రలోనే వైఎస్ఆర్‌సీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకం
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహానికి పార్టీ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే జోగి రమేష్, ఎంపీ సురేష్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే వైఎస్సార్‌సీపీ ప్రస్థానం చాలా ప్రత్యేకమని, పార్టీని సరికొత్త రాజకీయ విధానాలతో నడిపిన చరిత్ర వైఎస్ జగన్‌దన్నారు. వైఎస్సార్‌ మరణించినప్పుడు ప్రత్యేక పరిస్ధితుల్లో ఒంటరిగా పార్టీ పెట్టారని.. ఆ రోజు నుంచి నిరంతరం వైఎస్ జగన్‌.. ప్రజల్లో మమేకమయ్యారన్నారు.

‘‘ఇతర పార్టీల్లా కాకుండా.. వైఎస్సార్‌సీపీని అన్నీ తానై నడిపించారు. జగన్ ధైర్యానికి, పోరాటానికి పదేళ్ల రాజకీయ ప్రస్థానమే ఉదాహరణ. రాజకీయ నిర్ణయాల్లో ఎక్కడా దాపరికాలు ఉండవు.. ఉన్నది ఉన్నట్టు చెప్పడమే మా నాయకుడి శైలి. పార్టీ నడిపే ప్రస్థానంలో అక్రమ కేసులతో జైలుకు పంపినా ఎక్కడా చెక్కు చెదరలేదు. ఆటుపోట్లతో వైఎస్ జగన్ ఉక్కు మనిషిలా ఆవిష్కృతమయ్యారు. 2014లో ఓడిపోయినప్పుడు అందరూ డీలాపడ్డా జగన్ మాత్రం అధైర్యపడలేదు. ఆ క్షణం నుంచి ప్రతిపక్ష నేతగా ప్రజలతో మరింత మమేకం అయ్యారు. అందుకే ఈరోజు 20 నెలల పాలనతో చరిత్ర సృష్టించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైఎస్ జగన్ పాలనకు ప్రజలు మద్దతు తెలపడమే నిదర్శనమని’’ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

వైఎస్సార్‌ ఆలోచన, స్ఫూర్తితో..
వైఎస్సార్‌ ఆలోచన, స్ఫూర్తితో వైఎస్‌ జగన్‌ పార్టీని స్థాపించారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఎన్నో ఇబ్బందులు పడి తండ్రి ఆశయం కోసం పోరాడారన్నారు. వైఎస్ జగన్ పోరాటానికి నిదర్శనమే 2019 ఎన్నికల ఫలితాలని పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేశారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన నాయకుడు దేశంలోనే మరొకరు లేరు.మేనిఫెస్టోను ఇంత పక్కాగా అమలు చేసిన నాయకుడు ఎవరూ లేరని మంత్రి బొత్స అన్నారు.

సీఎం జగన్ వెనకడుగు వేయలేదు..
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ఎన్ని ఇబ్బందులు పెట్టినా సీఎం జగన్ వెనకడుగు వేయలేదన్నారు. వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోయే పాదయాత్ర చేశారని.. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని ఆయన నెరవేర్చారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.
 


పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
వైఎస్సార్‌ జిల్లా: పులివెందులలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  వైఎస్సార్‌ ఆడిటోరియం వద్ద పార్టీ జెండాను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి  ఆవిష్కరించారు. అనంతరం  కేక్ కట్ చేశారు.

కేక్‌ కట్‌ చేసిన ఎమ్మెల్యే పార్థసారధి..
కృష్ణా జిల్లా: వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విజయవాడ పోరంకి సెంటర్‌లో పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఎమ్మెల్యే  కొలుసు పార్థసారథి కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంక్షేమం, అభివృద్ధే వైఎస్సార్‌సీపీ లక్ష్యం..
చిత్తూరు: తిరుపతిలో వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి.. పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ జెండా జనం గుండెల్లో నిలిచిపోయిందన్నారు. ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి సీఎం జగన్.. ప్రజల మన్ననలు పొందారన్నారు. కొత్త పాలక వర్గాలతో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధే వైఎస్సార్‌సీపీ లక్ష్యమన్నారు.

ప్రజల కోసం పుట్టిన పార్టీ..
విశాఖపట్నం: విశాఖ నగర కార్యాలయంలో వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.  ఎమ్మెల్యే అదీప్ రాజు, పార్టీ నగర అధ్యక్షుడు వంశీ కృష్ణ .. పార్టీగ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కేకే రాజు, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, రెహమాన్, తైనాల విజయ కుమార్, చొక్కాకుల వెంకటరావు, చింతలపూడి వెంకట రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదీప్‌ రాజు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీని స్థాపించారని తెలిపారు. వైఎస్‌ జగన్‌ను  సోనియాగాంధీ, చంద్రబాబు కుమ్మకై ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు.వారి కుట్రలను సీఎం జగన్‌ ధైర్యంగా ఎదుర్కొన్నారన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి:
నాటి నుంచి నేటి వరకు.. ప్రజాపథమే అజెండా 
పాలనలో, పార్టీలో మానవీయ ముద్ర

Advertisement
Advertisement