మునగానపల్లెలో మాయమై బెంగళూరులో ప్రత్యక్షం | Sakshi
Sakshi News home page

మునగానపల్లెలో మాయమై బెంగళూరులో ప్రత్యక్షం

Published Tue, Aug 1 2023 1:12 AM

రవితేజ - Sakshi

బి.కొత్తకోట : బాగా చదువుకోమని తండ్రి చెబితే పాఠశాల నుంచి ఇంటికి రాకుండా అదృశ్యమైన విద్యార్థి సోమవారం కర్ణాటకలోని బెంగళూరు గాంధీనగర్‌ పోలీసులకు చిక్కాడు. ఈ విషయమై అక్కడి పోలీసులు బి.కొత్తకోట ఎస్‌ఐ రామమోహన్‌తో చర్చించారు. వివరాలు ఇలా.. పెద్దతిప్పసముద్రం మండలం సంపతికోటకు చెందిన విశ్వనాథరెడ్డి కుమారుడు రవితేజ (14) గ్రామానికి సమీపంలోని కర్ణాటకకు చెందిన మునగానపల్లె ప్రభుత్వ హైస్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నాడు. ప్రతిరోజూ హైస్కూల్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేవాడు. జూలై 12న బాగా చదువుకోవాలని కొడుకుకు తండ్రి సూచించాడు. ఆరోజు హైస్కూల్‌కు వెళ్లిన రవితేజ ఇంటికి తిరిగి రాలేదు. అదృశ్యమైన కొడుకు కోసం తండ్రి బట్లపల్లె పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలుచోట్ల గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. సోమవారం బెంగళూరు గాంధీనగర్‌ పరిసరాల్లో సంచరిస్తున్న రవితేజను పోలీసులు గుర్తించి వివరాలు ఆరా తీశారు. పోలీసుల విచారణలో తనది బి.కొత్తకోటగా చెప్పాడు. దీనితో స్థానిక ఎస్‌ఐను సంప్రదించిన గాంధీనగర్‌ పోలీసులు రవితేజ ఫొటో, వివరాలు పంపారు. ఈమేరకు సంపతికోటకు చెందిన విశ్వనాథరెడ్డి కుమారుడిగా గుర్తించి బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు.

Advertisement
Advertisement