Sakshi News home page

టీడీపీ నేత ఫామ్‌హౌస్‌లో పోలీసుల తనిఖీ

Published Tue, Aug 29 2023 12:50 AM

ముంబై డ్రగ్స్‌ మాఫియా సేదతీరిన టీడీపీ నేత ఫామ్‌హౌస్‌లో పరిశీలిస్తున్న డీఎస్పీ ,సీఐ   - Sakshi

రాయచోటి : ముంబై డ్రగ్స్‌ మాఫియా ముఠా సభ్యుడు విడిది చేసిన టీడీపీ నేత ఫామ్‌హౌస్‌ను రాయచోటి డీఎస్పీ మహబూబ్‌బాషా, అర్బన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి తనిఖీలు నిర్వహించారు. సోమవారం రాయచోటి–రాజంపేట మార్గంలోని ఓదివీడు సమీపంలో ఉన్న టీడీపీనేత ఫామ్‌హౌస్‌ను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. డ్రగ్స్‌ మాఫియాతో టీడీపీ నాయకులకు సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం ఆ పార్టీ నాయకులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో డ్రగ్స్‌ మాఫియా కలకలం వారిలో మరింత వేదనకు గురిచేస్తోంది.

మరోవైపు కేసు నుంచి బయటపడేందుకు ఆ పార్టీ సీనియర్‌ నేతల నుంచి పోలీసులపై ఒత్తిడిలు తెస్తున్నట్లు సమాచారం. వారం రోజుల కిందట డ్రగ్స్‌ మాఫియా సభ్యుడిని ముంబై పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అతని అరెస్టుతో పాటు అక్కడే ఉన్న కొంత మాదక ద్రవ్యాన్ని కూడా ముంబై పోలీసులు స్వాధీనం చేసుకుని పట్టుకెళ్లారు. డ్రగ్స్‌ ముఠా మాఫియాతో టీడీపీ నేతకున్న సంబంధాలపైన కూడా పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఆశ్రయం కల్పించిన ఆ టీడీపీ నేతకు చెందిన సిమ్‌ కార్డులను స్వాధీనం చేసుకొని పరిశీలన చేస్తున్నట్లు రాయచోటి అర్బన్‌ సీఐ సుధాకర్‌రెడ్డి తెలిపారు.

వారి కుటుంబసభ్యుల సెల్‌ఫోన్‌ నెంబర్లను కూడా పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. విడిది చేసిన ఫామ్‌హౌస్‌ను, పరిసర ప్రాంతాలను కూడా పరిశీలించి పలు అనుమానాలను నివృత్తి చేసుకున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు.

మాఫియా ముఠా పరిస్థితులపై ముంబై పోలీసులు అందించే సమాచారం కోసం వేచిచూస్తున్నామని సీఐ తెలిపారు. డ్రగ్స్‌ మాఫియా సభ్యుడితో టీడీపీ నేతకున్న సంబంధాలు, ఈ ప్రాంతంలో మరేతర వారితో ఉన్న వ్యాపార సంబంధాల పైన కూడా మా కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఏదేమైనా డ్రగ్స్‌ ముఠా సభ్యుడికి ఆశ్రయంకల్పించిన టీడీపీ నేతపై ఆ పార్టీ నేతలు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement