రాయచోటి: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ గిరీషా పీఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లో జరిగిన సమావేశఃలో ఎస్పీ బి.కృష్ణారావు, ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి, జేసీ ఫర్మన్ అహ్మద్ ఖాన్లతో కలిసి ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారన్నారు. ఈ ఏడాది జులై 1 నుంచి అక్టోబర్ 31 వరకు 28 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు కాగా ఇందులో మూడు ఫాల్స్, నాలుగు పబ్లిక్ ట్రైల్స్లో ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే జి.శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాల సమాచారాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధ్యులపై కఠినచర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ కృష్ణారావు మాట్లాడుతూ ఎలాంటి పక్షపాతం, జాప్యం లేకుండా విచారణ చేయడం జరుగుతుందన్నారు.
కలెక్టర్ను కలిసిన శిక్షణ అధికారులు
భారత దర్శన్లో భాగంగా భారతదేశ పార్లమెంట్ కార్యాలయ సహాయ సెక్షన్ అధికారులు ఇందిరాదుబే, ప్రకాష్, మనోజ్కుమార్ తదితరులు కలెక్టర్ గిరీషా పీఎస్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
పరిశ్రమలతోనే అభివృద్ధి
పరిశ్రమల స్థాపనతోనే అన్నమయ్య జిల్లా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ గిరీషా పీఎస్ అన్నారు. కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పరిశ్రమల ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ నూతన పరిశ్రమలు స్థాపించేందుకు ఇప్పటివరకు 1548 దరఖాస్తులకు ఆమోదం తెలిపామన్నారు. వైఎస్సార్ జగనన్న బడుగు వికాసం కిందదారు యూనిట్లకు(వాహనాలు) పెట్టుబడి రాయితీగా రూ.3,81,7822 లు మంజూరు చేయడం జరిగిందన్నారు. అధికారులు జయలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, సత్యనారాయణ, వెంకటేశ్వర్ రెడ్డి, దినేష్ చంద్ర, ధనలక్ష్మీ, నారాయణరెడ్డి, నాగభూషణం, రాజశేఖర్, రామ్మూర్తి నాయక్, రామకృష్ణ, అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
అందరికీ ఓటు హక్కు కల్పించాలి
అర్హులందరికీ ఓటు హక్కు కల్పించేలా చూడాలని కలెక్టర్ గిరీషా పీఎస్ అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్లో విడియో కాన్ఫరెన్స్ ద్వారా ముసాయిదా ఓటరు జాబితా, తదితర అంశాలపై మండల అధికారులతో ఆయన సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో ఓటరు జాబితా తయారీ చేసేందుకు ఎక్కువ సమయం కేటాయించాలని తహశీల్దార్లను ఆదేశించారు. వీఆర్వోల లాగిన్లో ఉన్న పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి పూర్తి చేయాలన్నారు.