ఓబులవారిపల్లె: మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గిరీషా పీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ విజయారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో ప్రభుత్వవిప్ కొరముట్ల శ్రీనివాసులు, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొననున్నారని తెలిపారు. ప్రజలు తమ సమస్యలను వీరి దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు.
రేపు జాబ్మేళా
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థతో కలిసి గురువారం ఉదయం 10.00 గంటలకు కలెక్టరేట్లోని తమ కార్యాలయంలో పలు కంపెనీలతో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు(18–35 సంవత్సరాల మధ్య వయస్సు) అర్హులన్నారు. ఎంపికై న వారికి హోదాను బట్టి రూ.13వేల నుంచి 25 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. ఆసక్తిగల వారు తమ ధృవపత్రాలు తీసుకుని జాబ్మేళాకు హాజరు కావాలన్నారు.
రాష్ట్ర రగ్బీ జట్టుకు ఎంపిక
కడప స్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో భువనేశ్వర్లో డిసెంబర్ నెలలో నిర్వహించనున్న ఎస్జీఎఫ్ రగ్బీ అండర్–14 బాలుర విభాగంలో పాల్గొనే ఏపీ జట్టుకు కడప నగరానికి చెందిన ఎస్. పునీత్రాజ్ ఎంపికయ్యాడు. నగరంలోని చెమ్ముమియాపేట బాలుర ఉన్నత పాఠశాలలో చదువుతున్న పునీత్రాజ్ ఇటీవల కర్నూలులో నిర్వహించిన ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి రగ్బీ అండర్–14 విభాగంలో చక్కగా రాణించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా క్రీడాకారున్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గిరిజాకుమారి, ఫిజికల్ డైరెక్టర్ ఎం. ప్రవీణ్కిరణ్ అభినందించారు.
నిత్యాన్నదానానికి రూ.లక్ష
చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116లు విరాళంగా వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ అలవలపాటి ముకుందరెడ్డి తెలిపారు. కడప నగరం ఓంశాంతి నగర్కు చెందిన గోశెట్టి తిమ్మగారి మదన్ కుమార్ జ్ఙాపకార్థం వారి తల్లిదండ్రులు చిన్నమాదన్న,రమాదేవి దీనిని అందజేశారన్నారు. ఈ సందర్భంగా దాతలచే ప్రత్యేక పూజలు చేయించి స్వామి చిత్రపటం, శేషవస్త్రంతో సత్కరించినట్లు తెలిపారు.
నూతన నియామకం
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ విభాగంలో అదనపు అధికారులను మంగళవారం నియమించారు. వైస్ చాన్సలర్ ఆచార్య చింతా సుధాకర్, రిజిస్ట్రార్ ఆచార్య వై.పి.వెంకటసుబ్బయ్యలు నూతన అధికారులుగా నియమితులైన డాశ్రీశ్రీఎం.మమతకుమారి (మెటీరియల్సైన్స్ అండ్ నానోటెక్నాలజీ), డాశ్రీశ్రీకె.శ్రీనివాసరావు (కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ)లకు నియామక పత్రాలను అందజేశారు. ఇప్పటి వరకు ఈ స్థానంలో పనిచేసిన డాశ్రీశ్రీఎస్.ఆదినారాయణరెడ్డి, డాశ్రీశ్రీఎస్.సుమిత్రల పదవీకాలం పూర్తికావడంతో పైవారిని నియమించారు. కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి పాల్గొన్నారు.