రాయచోటి టౌన్ : జిల్లా వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి నిర్వహించే ఆడుదాం.. ఆంధ్ర క్రీడా పోటీలకు సిద్ధం కావాలని జాయింట్ కలెక్టర్ ఫర్హాన్ అహమ్మద్ఖాన్ తెలిపారు. శనివారం రాయచోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆడుదాం.. ఆంధ్ర క్రీడా పోటీలకు సంబంధించి ర్యాలీని అడిషనల్ ఎస్పీ డాక్టర్ రాజ్కమల్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 ఏళ్లు నిండిన వారందరికీ భాగస్వామ్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. క్రికెట్, కబడ్డీ, ఖో–ఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడలు గ్రామ సచివాలయ స్థాయి నుంచి మండల, జిల్లా స్థాయి చివరిగా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, మున్సిపల్ కమిషనర్ గంగాప్రసాద్, డీఈవో శ్రీరాం పురుషోత్తం, జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు. ఇదే అంశంపై సంబంధిత శాఖల అధికారులతో జేసీ కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
వినియోగదారుల హక్కులపై అవగాహన
రాయచోటి : జాతీయ వినియోగదారుల దినోత్సవం–2023 పురస్కరించుకొని రాయచోటి కలెక్టరేట్ స్పందన హాల్లో ఈ–కామర్స్, డిజిటల్ వర్తకం శకంలో వినియోగదారుల రక్షణ అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా పౌరసరఫరాల సంస్థ అధికారి రఘురాం, జిల్లా లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ వి.రమేష్కుమార్రెడ్డి, డీఈఓ శ్రీరామ్ పురుషోత్తం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త వినియోగదారుల రక్షణ చట్టం–2019పై అవగాహన పెంచుకోవాలన్నారు. వ్యాస రచన, వక్తృత్వ పోటీలలో విజేతలకు నగదు ప్రోత్సాహకం, సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ పి.శివరాం మూర్తి, డీఎంహెచ్ఓ డాక్టర్ కె.కొండయ్య తదితరులు పాల్గొన్నారు.