● అమరావతిలో 50,793 మందికి ఇళ్ల పట్టాలు ● ఎమ్మెల్సీ పోతుల సునీత
చీరాల: అమరావతిలో 80 శాతం మేర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50,793 మందికి ఇళ్ల స్థలాల పట్టాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందించడం దేశంలోనే ఒక చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. దేశ చరిత్రలో ఎంతో మందికి ఇళ్లు లేక, సొంతింటి కల నెరవేర్చుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు లేనివారికి సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెరవేర్చారన్నారు. గూడు లేనివారికి గూడు కల్పించి వారికి ఒక ఆస్తి కల్పించాలని ఆయన దృఢ సంకల్పంతో ఇళ్ల స్థలాల పట్టాల కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు గత ప్రభుత్వంలో అమరావతిని రాజధానిగా చెప్పి ప్రజలందరికీ భ్రమరావతిని చూపించారన్నారు. కేంద్రం అమరావతికి రూ.3500 కోట్లు ఇస్తే ఆయనేం చేశాడన్నారు. 35 వేల ఎకరాల పొలం తీసుకుని రియల్ఎస్టేట్గా మార్చారన్నారు. వారి పెత్తందారులే అక్కడ ఉండాలని చూశారని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారం చేపట్టిన తర్వాత అమరావతిలో అందరూ ఉండాలనే సంకల్పంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెద్దఎత్తున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. ఇళ్ల పట్టాలతోపాటు రోడ్డు కూడా వేయనున్నారన్నారు. జులై 8న దివంగత నేత వైఎస్సార్ జయంతి రోజున ఇళ్ల నిర్మాణాన్ని సంపూర్ణంగా చేపడతారన్నారు. పేదల పక్షాన ఉండి పోరాడుతున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. నాలుగేళ్ల కాలంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందించి వారికి సుపరిపాలన అందించారన్నారు. అక్కచెల్లెమ్మలను సంతోషంగా ఉంచాలనే నిర్ణయంతో వారికి ఆర్థికంగా బలోపేతం చేసేందుకు అమ్మ ఒడి, ఆసరా, చేయూత, విద్యాదీవెన, వసతి దీవెన వంటివి అందించారని చెప్పారు. రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్న వైఎస్సార్సీపీపై పచ్చమీడియా చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టాలన్నారు. 2019 ఎన్నికల మాదిరిగానే 2024 ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలకు ఇదే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర ప్రజలు రానున్న ఎన్నికల్లో సుపరిపాలన అందిస్తున్న వైఎస్సార్సీపీకి మరోసారి పట్టం కట్టాలన్నారు.