బాపట్ల అర్బన్ : పేదలు తమ ఆరోగ్యంపై ఇక బెంగపడవనవసరం లేదు. ఆస్పత్రికి వెళ్లాలన్నా.. మందులు కొనాలన్నా.. ఆందోళన కూడా అక్కర్లేదు. ఏ రుగ్మత వచ్చినా యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ వివరాలు నమోదు చేస్తే వెంటనే ఏఎన్ఎం ఇంటికి వచ్చి తక్షణ వైద్య సాయం అందేలా చూస్తారు. ఉపశమనం లభించకపోతే వైద్యాధికారి ఇంటి వద్దకే వస్తారు. ప్రజల వద్దకు పాలన నినాదంతో ముందుకు వెళ్తున్న సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఆ ప్రజల ముంగిటకే సంపూర్ణ వైద్య సేవలు అందించే ప్రక్రియకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా నాంది పలికింది.
జగనన్న సురక్ష తరహాలోనే
ఇప్పటికే జగనన్న సురక్ష ద్వారా ఇంటి వద్దకు అన్ని రకాల సేవలను తీసుకువచ్చిన ప్రభుత్వం ఇప్పుడు ఆ తరహాలోనే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తొలుత ఏఎన్ఎంలు, వలంటీర్లు జగనన్న ఆరోగ్య సురక్ష యాప్ను తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని ఇంటింటా సర్వే చేపడతారు ఇంట్లోని సభ్యులందరూ ఆరోగ్యంగా ఉన్నారా లేదా ఎవరికై నా ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, ఉంటే వాటికి చికిత్స పొందుతున్నారా, తదితర వివరాలు సేకరిస్తారు. సర్వే ద్వారా గుర్తించిన అనారోగ్య పీడుతులకు ఆయా ప్రాంతాల పరిసరాలలోనే వైద్య నిపుణుల ద్వారా చికిత్స అందిస్తారు. అవసరమైతే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్సలు చేయిస్తారు. ఉచితంగా మందులు అందజేస్తారు. వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా సాయం కూడా అందిస్తారు.
ముమ్మరంగా సర్వే
జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే ప్రస్తుతం ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలో 375 విలేజ్ హెల్త్ క్లినిక్లు, 363 ప్రాంతాలు, 12 పట్టణ ప్రాంతాల్లో ఇంటింటా సర్వే చేపట్టారు. వలంటీర్లు జగనన్న ఆరోగ్య సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొని సర్వే చేస్తున్నారు. ఇంటి వద్దనే కుటుంబ సభ్యులందరికీ ఏడు రకాల వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆ కుటుంబంలోని వ్యక్తి సెల్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసి సర్వే వివరాలు అందులో అప్లోడ్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 5,49,000 కుటుంబాలు ఉండగా శనివారం మధ్యాహ్నం నాటికి 63,000 కుటుంబాల సర్వేను వైద్యసిబ్బంది, వలంటీర్లు పూర్తిచేశారు. 2,30,185 మందికి వైద్య పరీక్షలు చేశారు.
ఈ యాప్ ఆపద్బాంధవే
జగనన్న ఆరోగ్య సురక్ష యాప్ ఉంటే ఆరోగ్యానికి భరోసా దొరికినట్లేనని అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అనే భయం లేకుండా కుటుంబంలో ఎవరికి ఆరోగ్యం బాగా లేకపోయినా ఆ వివరాలను ఆ యాప్లో పొందుపరిస్తే వెంటనే దగ్గర్లోని ఏఎన్ఎం వచ్చి చికిత్స అందిస్తారు. ఇది రోగులకు ప్రథమ చికిత్సగా ఉపయోగపడుతుంది. రోగి పరిస్థితిని బట్టి వైద్యాధికారి కూడా వచ్చి చికిత్స అందిస్తారు.
ఆరోగ్యశ్రీ వివరాలు తెలిపే
కరపత్రాలు పంపిణీ
జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలకు మేలుకు జరుగుతుంది. ఇప్పటివరకు ఏయే వ్యాధులు ఆరోగ్య శ్రీ పరిధిలోకి వస్తాయి, వాటిని పొందాలంటే ఏ పేపర్లు తీసుకెళ్లాలి అత్యవసర వైద్య సాయం పొందే విధానం ఏమిటనే అంశాలు క్షుణ్ణంగా తెలిసేలా కరపత్రాలు ముద్రించి ప్రతి ఇంటికి పంపిణీ చేస్తున్నారు. దీనివలన ప్రతి ఒక్కరికి వైఎస్సార్ ఆరోగ్యశ్రీ వైద్య సేవలు ఏ విధంగా పొందవచ్చు అనే అవగాహన కలుగుతుంది.
రోగి కోలుకునే వరకు భరోసా
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో చికిత్స పొందిన రోగి కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయంలో వారి జీవనానికి ఇబ్బంది కలగకుండా వైఎస్సార్ ఆరోగ్య ఆసరా ద్వారా రోజుకు రూ. 225 చొప్పున రూ.5,000 వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది. తద్వారా కష్టకాలంలో ఆ కుటుంబానికి భరోసానిస్తుంది.
ముమ్మరంగా జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే ఉచితంగా ఏడు రకాల వైద్య పరీక్షలు ప్రతి ఒక్కరి మొబైల్లో యాప్ డౌన్లోడ్ వ్యాధిని బట్టి వైద్య శిబిరం లేదా ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్యం ఇకపై ప్రజలకు మరింతగా ఆరోగ్య భద్రత
జోరుగా ఇంటింటి సర్వే
బాపట్ల జిల్లాలో జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటి సర్వే ద్వారా వైద్య పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటివరకు 63,000 ఇళ్లల్లో సర్వే పూర్తి చేశాం. 2,30,185 ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఈనెల 30 నుంచి షెడ్యూల్ ప్రకారం ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తాం.
– డాక్టర్ ఎస్.విజయమ్మ,
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి
ఈనెల 16 నుంచి 23 మధ్య నిర్వహించిన ఆరోగ్య పరీక్షల వివరాలు ఇవే
పరీక్ష శ్యాంపిళ్ల సంఖ్య
రక్త పోటు (బీపీ) 82,000
మధుమేహం (షుగర్) 69,000
మూత్ర (యూరిన్) 2,600
హిమోగ్లోబిన్ 74,000
మలేరియా 900
డెంగి 563
కఫం 1,122
మొత్తం 2,30,185