పెదకూరపాడు,అమరావతి: అమరేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇస్తున్నా అమరావతిని మున్సిపాలిటీ చేస్తామని పెదకూరపాడు శాసన సభ్యులు నంబూరు శంకరరావు చెప్పారు. అమరావతిలోని ప్రధాన రహదారిలో జరిగిన సామాజిక సాధికార బస్సు యాత్రలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 90 శాతం పూర్తి చేసినట్లు చెప్పారు. బెల్లంకొండ – అమరావతి డబుల్ రోడ్డు, వైద్యశాలలు, గ్రామీణ రోడ్లు, అంతర్గత రోడ్ల అభివృద్ధి, పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేసినట్టు వివరించారు. మనబడి నాడు–నేడు కింద పాఠశాలల అభివృద్ధి, పులిచింతల వద్ద బ్రిడ్జి నిర్మాణం, సత్తెమ్మ తల్లి ఆలయం వద్ద అటవీ శాఖ అనుమతులతో రోడ్ల అభివృద్ధి, వైకుంఠపురం వేంకటేశ్వరరస్వామి ఆలయం ఘాట్ రోడ్డు, అమరావతి నుంచి తుళ్ళూరు వరకు రోడ్డు, మద్దూరు వద్ద బ్రిడ్జి, కోళ్లూరు ఆంజనేయ స్వామి ఆలయం అభివృద్ధికి స్థలం కేటాయింపు, లిఫ్ట్ ఇరిగేషన్లకు మరమ్మతులు ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. అమరావతిని నిర్మిస్తామని చెబుతున్న చంద్రబాబు నాయుడు కనీసం అమరావతికి రోడ్డు వేయలేకపోయారన్నారు మాజీ ఎమ్మెల్యే కోమ్మాలపాటి శ్రీధర్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారన్నారు. శంకరరావు మాట ఇస్తే శివుడు సాక్షిగా పూర్తి చేస్తాడని స్పష్టం చేశారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు పెదకూరపాడు, మండెపూడి, పీసపాడు, తాళ్లచెరువు లిఫ్ట్ ఇరిగేషన్లు నిర్మిస్తామన్నారు. అమరావతిలో డ్రెయినేజి సమస్యను తీరుస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సహాయంతో పెదకూరపాడును మరింత అభివృద్ధి చేస్తామన్నారు. పెదకూరపాడు గతంలో టీడీపీ అడ్డా అని అనేక మంది అనే వారని, ఇప్పుడు ఇది వైఎస్సార్ సీీపీ గడ్డగా మారిందన్నారు. తనపై పోటీ చేసేందుకే టీడీపీ వారు ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే నంబూరు శంకరరావు