నగరంపాలెం: గుంటూరు జిల్లాలో లైసెన్స్ లేకుండా టపాసులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని గుంటూరు రేంజ్ ఐ.జి. జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ జి.పాలరాజు శనివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. టపాసులు విక్రయించే ప్రాంతాల్లోనూ జాగ్రత్తలు పాటించకపోయిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను రేంజ్ ఐజీ ఆదేశించారు. పిల్లలు బాణాసంచా కాల్చేటప్పుడు తల్లిదండ్రులు గమనించాలన్నారు. జిల్లాలో బాణ సంచా విక్రయాల లైసెన్సు పొందిన దుకాణాల్లోనే ప్రభుత్వ నిబంధలనకు అనుగుణంగా బాణసంచా విక్రయించాలని తెలిపారు. అదే విధంగా బాణాసంచా లైసెన్సుదారులు బహిరంగ ప్రదేశాల్లో నిర్ణీత కొలతలప్రకారం దుకాణాలు నెలకొల్పలని అన్నారు. దుకాణాల వద్ద నీరు, ఇసుక, అగ్నిమాపక సామాగ్రిని సిద్ధంగా ఉంచాలని తెలిపారు. లైసెన్సుల్లేకుండా ఎవరైనా టపాసులు తయారుచేసిన, నిల్వ చేసి విక్రయించిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. జిల్లాలో ఎక్కడైనా బాణసంచా అక్రమ విక్రయాలు, నిల్వల సమాచారం ఉన్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గుంటూరు రేంజ్ పరిధిలో పోలీస్ అధికారులు, సిబ్బందికి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.