కారంచేడు: జిల్లాలోని గ్రంథాలయాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఉమ్మడి ప్రకాశం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కాసు ఆదిలక్ష్మి అన్నారు. శుక్రవారం ఆమె కారంచేడు మాస్కో బజారు వద్ద ఉన్న గ్రంథాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్రంథాలయాల వారోత్సవాల నిర్వహణపై ఆమె సమీక్షించారు. గ్రంథాలయానికి సంబంధించిన అన్ని రకాల రికార్డులను ఆమె పరిశీలించారు. గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను గ్రామస్తులు, వ్యాపారులు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు చక్కగా వినియోగించుకునేలా వారిలో అవగాహన కల్పించాలన్నారు. మహిళలు తీరిక వేళల్లో చదువుకోవడానికి వీలుగా ఉండేలా పుస్తకాలను ఇళ్లకు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జనరల్ నాలెడ్జ్కు సంబంధించిన పుస్తకాలను విద్యార్థులు డిపాజిట్ చేసి తీసుకెళ్లేలా అవగాహన కల్పించాలన్నారు. వారోత్సవాల్లో నిర్వహించే పోటీల్లో విజేతలకు స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో బహుమతులు అందించాలని ఆమె ఆదేశించారు. కార్యక్రమంలో లైబ్రేరియన్ నాగయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.