ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ పోలా భాస్కర్
చినగంజాం: కొత్త ఓటరు నమోదు, చనిపోయిన ఓటర్లు, ఓట్లు బదిలీ విషయంలో బూత్ స్థాయి అధికారులు పూర్తి సమాచారం సేకరించాలని ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని కడవకుదురు గ్రామ పంచాయతీ పరిధిలో పోలింగ్ బూత్లను సందర్శించి అనంతరం ఎంపీపీ పాఠశాల పోలింగ్ కేంద్రంతో నిర్వహించిన బూత్ స్థాయి అధికారుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఆర్డీఓ సరోజిని, ఈఆర్ఓ వెంకట నారాయణ, తహసీల్దార్ పీ పార్వతి, డీటీలు శ్రీకాంత్, సుబ్బారావు, బూత్ లెవల్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
అబ్జర్వర్ను కలిసిన ఆమంచి
ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ పోల భాస్కర్ను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పర్చూరు నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ మంగళవారం కడవకుదురులో మర్యాద పూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో ఓటర్ల జాబితాను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
బీఎల్ఓలు సక్రమంగా పనిచేయాలి
చీరాల టౌన్: ఎన్నికల నియమ నిబంధనలపై బీఎల్ఓలు పూర్తి అవగాహన కలిగి ఉండాలి.. సక్రమంగా పనిచేస్తేనే పక్కాగా ఓటర్ల జాబితా తయారవుతుందని ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ సూచించారు. జిల్లాకు ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్గా నియమితులైన ఆయన మంగళవారం జిల్లాలో తొలిసారిగా చీరాలలో పర్యటించారు. పట్టణంలోని తొమ్మిదో వార్డులో ఉన్న సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలోని 98 నంబర్ పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లోని వసతులు, విద్యుత్ సౌకర్యం, దివ్యాంగుల కోసం ర్యాంపుల పనులను పరిశీలించారు. ఓటర్ల జాబితాలో మృతుల పేర్లను తొలగించే ప్రక్రియను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటుగా వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చీరాల నియోజకవర్గంలో 1,97,532 మంది ఓటర్లు ఉండగా 280 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో మృతి చెందిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా విచారించి ఓట్ల తొలగింపులో బీఎల్ఓలు కీలకపాత్ర పోషించాలని కోరారు. ఎన్నికల విధులను నిర్వహిస్తేనే ఓటర్ల జాబితాలో తప్పులు, డబుల్ ఎంట్రీలు లేకుండా జాబితా తయారవుతుందని పేర్కొన్నారు. మృతుల ఓట్లు తొలగింపు, నూతన ఓట్లు నమోదు, చిరునామాలు, ఓటు బదిలీ అర్జీలను రెండు సార్లు క్షుణ్ణంగా విచారించాలన్నారు. ఎన్నికల విధులపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి వెంకటరమణ, చీరాల ఆర్డీఓ సరోజినిరెడ్డి, తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు, మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి ఉన్నారు.