జిల్లా వ్యవసాయాధికారి అబ్దుల్ సత్తార్
పర్చూరు (చినగంజాం): మిచాంగ్ తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతుల వివరాలను రైతు భరోసా కేంద్రాల పరిధిలో నమోదు చేస్తున్నట్లు బాపట్ల జిల్లా వ్యవసాయాధికారి అబ్దుల్ సత్తార్ పేర్కొన్నారు. మండలంలోని చెరుకూరు, రమణాయపాలెం, పోతుకట్ల గ్రామాల్లో తుఫాన్ వలన దెబ్బతిన్న పొగాకు, మిరప, మినుము, మొక్కజొన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు. పర్చూరు మండలంలో పొగాకు 13000 ఎకరాలు, మొక్కజొన్న 700 ఎకరాలు, మినుము 125 ఎకరాలు, పెసర 120 ఎకరాలు, మిరప 2800 ఎకరాలు, వరి 600 ఎకరాల వరకు నష్టపోయినట్లు అంచనా వేశారు. అన్ని రైతు భరోసా కేంద్రాల్లో పంట నష్టపోయిన రైతుల వివరాలు నమోదు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. వీరి వెంట మండల వ్యవసాయాధికారి ఎస్ రామ్మోహన్రెడ్డి, రైతు భరోసా సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.