చీరాల టౌన్: వైద్యులకు అన్నీ విధాలుగా అండగా ఉంటానని వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి కరణం వెంకటేష్ హామీ ఇచ్చారు. పట్టణంలోని ఐఎంఏ హాలులో చీరాలలోని ప్రైవేటు వైద్యశాలల వైద్యులతో ప్రత్యేక సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చీరాలలో ప్రైవేటు వైద్యులు అందరూ వైద్య వృత్తిని ప్రశాంతంగా నిర్వహించుకునేలా అండగా ఉంటామన్నారు. రానున్న ఎన్నికల్లో తనకు మద్దతునిచ్చి గెలుపునకు సహకరించాలని అభ్యర్థించారు. ఐదేళ్లలో చీరాల అభివృద్ధితో పాటుగా వైద్యులు, ప్రైవేటు వైద్యశాలల అందించే చికిత్సలు, ఇతర సేవలకు తాము ఏవిధంగా సహకారం అందించామో గుర్తుంచుకోవాలన్నారు. ప్రైవేటు వైద్యశాలలకు, వైద్య రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అందించిన సహకారంతో రాష్ట్రంలో మళ్లీ వైఎస్సార్ సీపీని అధికారంలోకి తీసుకురావడంతో పాటుగా చీరాలలో తనను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు పూర్తి మద్దతు, సహకారం అందించాలని వెంకటేష్ కోరారు. అనంతరం ఐఎంఏ వైద్యులు, వెంకటేష్ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఐఎంఏ అసోసియేషన్ వైద్యులు గోరంట్ల సుబ్బారావు, శ్రీదేవి, భవానీ ప్రసాద్, ఐ.బాబూరావు, ఉమామోహన్, బాలశంకరరావు, హరిహరనాథ్, శ్రీకాంత్, కృష్ణచైతన్య, నిరుపమ, అనీల్చౌదరి, రవికిరణ్, ప్రదీప్ రతన్ పాల్గొన్నారు.