ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలు
మణుగూరు రూరల్ : సింగరేణి మణుగూరు ఏరియాలోని కొండాపురం భూగర్భ గనిలో మంగళవారం సిలిండర్ పేలిన ఘటనలో ఇద్దరు కాంట్రాక్ట్ కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఎంఎస్ కంపెనీకి చెందిన ఫిట్టర్ గణశ్యామ్ బెహరా, హెల్పర్ ఎస్.సి. సింగ్ ఐదో లెవల్ ఎల్హెచ్డీ యంత్రం వద్ద మరమ్మతు పనులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ప్రమాదశాత్తు సిలిండర్ పేలడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. గణశ్యామ్ను మెరుగైన వైద్యం కోసం తొలుత కొత్తగూడెం ప్రధాన ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ కామినేని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలియగానే ఏరియా జీఎం దుర్గం రామచందర్ సింగరేణి ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. కాగా, గణశ్యామ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎస్.సి.సింగ్ కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
విద్యుదాఘాతంతో యువకుడికి గాయాలు
ములకలపల్లి: విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు గాయపడిన ఘటన మండల కేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన చరణ్ మండలంలోని ఎలకంవారిగుంపు గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. మంగళవారం ములకలపల్లిలో బంధువులు నిర్వహిస్తున్న సూపర్మార్కెట్కు వచ్చాడు. డాబా పైకి ఎక్కిన సమయంలో కోతులకు భయపడి పరుగుతీశాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయాడు, క్షతగాత్రుడిని వెంటనే స్థానిక మంగపేట పీహచ్సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
చర్ల: మద్యం మత్తులో పురుగులమందు తాగిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దుమ్ముగూడెం ఎస్ఐ కేశవ్ కథనం ప్రకారం.. జడ్.వీరభద్రాపురం గ్రామానికి చెందిన సున్నం బొజ్జి (32) నిత్యం మద్యం సేవిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో మద్యం మత్తులో పురుగులమందు తాగడంతో కుటుంబ సభ్యులు భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. మంగళవారం మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.