పోలీసుల అదుపులో ‘గుప్త నిధుల’ ముఠా? | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో ‘గుప్త నిధుల’ ముఠా?

Published Sun, Nov 19 2023 12:18 AM

-

దుమ్ముగూడెం: మండలంలోని ఆర్లగూడెం – అడవిరామారం గ్రామాల మధ్య గల అటవీప్రాంతంలో గుప్త నిధుల కోసం తొవ్వేందుకు ప్రయత్నించిన వ్యక్తులను ఆర్లగూడెం గ్రామస్థులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించినట్టు తెలిసింది. శనివారం రాత్రి రెండు గ్రామాల మధ్య గల అటవీప్రాంతంలో పసుపు, కుంకుమ ఇతర పూజా సామగ్రితో అటవీ ప్రాంతంలో తచ్చాడుతున్న కొంతమంది వ్యక్తులను గుర్తించిన ఆర్లగూడెం గ్రామస్తులు మిగతా వారికి సమాచారం అందించారు. దీంతో గ్రామస్తులంతా కలిసి ఘటనా స్థలానికి వెళ్లగా కొందరు బైక్‌లపై పారిపోయారు. నలుగురు వ్యక్తులు దొరకడంతో వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా భద్రాచలం – పాల్వంచకు చెందిన వ్యక్తులుగా చెప్పడంతోపాటు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement