రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! | Sakshi
Sakshi News home page

Aunkita Nandi: రెండు అద్దె కంప్యూటర్లతో రూ.100 కోట్ల వ్యాపారం! ఈ బెంగాలీ అమ్మాయి సంకల్పం మామూలుది కాదు.. 

Published Sat, Apr 29 2023 8:48 PM

Aunkita Nandi Kolkata woman made Rs 100 crore business from 2 rented computers - Sakshi

ఆమె ఐఐటీ, ఐఐఎంలలో చదువుకోలేదు.. ఉన్నత స్థాయి సంపన్న కుటుంబం నుంచి రాలేదు.. తండ్రి పేద్ద వ్యాపారవేత్తేమీ కాదు..  అయినా ఆమె ఓ కంపెనీ స్థాపించి విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగింది. ఆ యువతి స్ఫూర్తివంతమైన కథ మీ కోసం...

ఇదీ చదవండి: Kresha Gupta: రూ.100 కోట్ల ఫండ్‌.. స్టాక్‌ మార్కెట్‌ యువ సంచలనం ఈమె!

అంకితా నంది.. కోల్‌కతాకు చెందిన కంపెనీ టయర్ 5 టెక్నాలజీ సొల్యూషన్స్‌ వ్యవస్థాపకురాలు, మేనేజింగ్ డైరెక్టర్. తన భర్తతో కలిసి  2015లో ఈ కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీ వ్యాపార సంస్థల కోసం కావాల్సిన సాంకేతిక ఆవిష్కరణలు, ఉత్పత్తులు అందిస్తుంది. ఈ కంపెనీకి ప్రస్తుతం కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో వందలాది మంది ఉద్యోగులతో కార్యాలయం ఉంది. 

ఆసక్తికర నేపథ్యం
అంకితా నంది బెంగాల్‌లోని బుర్ద్వాన్ జిల్లాకు చెందినవారు. ఆమెది మధ్యతరగతి కుటుంబం. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. పాఠశాల విద్యాభ్యాసం బెంగాలీ మీడియంలోనే పూర్తయింది. చిన్నతనం నుంచే సొంతంగా కంపెనీ పెట్టాలని కలలు కన్న ఆమె కాలేజీలో చదువుతున్నప్పడే సాఫ్ట్‌వేర్ తయారు చేయడం ప్రారంభించింది. ఆమె చదివింది స్థానికంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలలోనే. ఆమె తన స్నేహితులతో కలిసి ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లను తయారు చేసి విక్రయించేవారు. వ్యాపారవేత్త కావాలనే ఆలోచన ఆమెకు అలా వచ్చిందే.

అంకితా నందికి ఓ డేటింగ్ యాప్ ద్వారా అమెరికాకు చెందిన జోన్ వాన్‌తో పరిచయం ఏర్పడింది. ఆయన ఫ్లోరిడాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఇద్దరూ 2021లో వివాహం చేసుకున్నారు. అయితే 2015లోనే వీరిద్దరూ కలిసి టయర్ 5 టెక్నాలజీ సొల్యూషన్స్‌ కంపెనీని స్థాపించారు. 2021లో ఈ కంపెనీ విలువ 12 మిలియన్ డాలర్లు. అది ఇప్పుడు దాదాపు రూ. 100 కోట్లు.

 

రెండు అద్దె కంప్యూటర్లు, ఇద్దరు ఉద్యోగులు
అంకితా నంది కేవలం రెండు కంప్యూటర్లతో కంపెనీని ప్రారంభించారు. అవి కూడా అద్దె కంప్యూటర్లు. ప్రారంభంలో కంపెనీలో ఉన్నది ఇద్దరు ఉద్యోగులు మాత్రమే. ఒక డెవలపర్, ఒక హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్. ఈ కంపెనీలో ఇప్పుడు 100 మందికి పైగా ఉద్యోగులు, 1500 మంది కస్టమర్లు ఉన్నారు. కంపెనీ ప్రధాన కార్యాలయం యూఎస్‌ఏలోని ఇండియానాలో ఉండగా భారత్‌లోని కోల్‌కతాలోనూ కార్యాలయం ఉంది. దాదాపు 25 సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులను కంపెనీ అందిస్తోంది. కంపెనీ కార్పొరేట్ సామాజిక బాధ్యత విభాగానికి అంకితా నంది నాయకత్వం వహిస్తున్నారు. తన ఎనిమిదేళ్ల కెరీర్‌లో అనేక ప్రశంసలు అందుకున్నారు.

ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్‌!

Advertisement
Advertisement