చోళమండలం ఇన్వెస్ట్‌ గూటికి పేస్విఫ్‌ | Sakshi
Sakshi News home page

చోళమండలం ఇన్వెస్ట్‌ గూటికి పేస్విఫ్‌

Published Tue, Jan 18 2022 2:35 AM

Cholamandalam Investment to acquire 72percent stake in Payswiff for Rs 450 cr - Sakshi

న్యూఢిల్లీ: ఫిన్‌టెక్‌ పేమెంట్‌ సొల్యూషన్స్‌ అందించే పేస్విఫ్‌ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్ల చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఫైనాన్స్‌ కంపెనీ తాజాగా వెల్లడించింది. రూ. 450 కోట్లను వెచ్చించడం ద్వారా 72.12% వాటా సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వాటా కొనుగోలు ఒప్పందం(ఎస్‌పీఏ) కుదుర్చుకున్నట్లు పేర్కొంది. కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులతో డీల్‌ కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వాటా కొనుగోలు తదుపరి పేస్విఫ్‌ను అనుబంధ సంస్థగా ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది. షేరుకి రూ. 1,622.66 ధరలో నగదు ద్వారా ఒకేసారి లేదా దశలవారీగా మెజారిటీ వాటాను చేజిక్కించుకోనున్నట్లు వివరించింది.  

బ్యాక్‌గ్రౌండ్‌ ఇలా: 2013లో ప్రారంభమైన పేస్విఫ్‌ ఆన్‌లైన్‌ పేమెంట్‌ గేట్‌వే సర్వీసులు అందిస్తోంది. ప్రధానంగా ఈకామర్స్‌ బిజినెస్‌లకు సేవ లు సమకూర్చుతోంది. ఈకామర్స్‌ సొల్యూషన్స్‌ను అందిస్తోంది. బిజినెస్‌ యజమానులు కస్టమర్ల నుంచి చెల్లింపులను ఆమోదించేందుకు వీలుగా ఓమ్నీచానల్‌ పేమెంట్‌ లావాదేవీల సొల్యూషన్స్‌ సమకూర్చుతోంది. స్టోర్లలో, హోమ్‌డెలివరీ (ఇంటివద్ద), ఆన్‌లైన్, ఎంపీవోఎస్, పీవోఎస్‌ తదితరాల ద్వారా చెల్లింపులు నిర్వహించేందుకు వీలు కల్పిస్తోంది. మొత్తం రుణ మంజూరీ విధానంలో ఆధునిక మార్పులు, విస్తరణలకుగాను కంపెనీ అమలు చేస్తున్న దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా తాజా కొనుగోలుకి తెరతీసినట్లు చోళమండలం ఇన్వెస్ట్‌ పేర్కొంది. ప్రధానంగా ఎస్‌ఎంఈ విభాగం రుణాల మంజూరీలో ఎకో సిస్టమ్‌ను అమలు చేసేందుకు ఇది తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది.

Advertisement
Advertisement