భారీ పెట్టుబడులకు కోకాకోల సర్వం సిద్ధం | Coca Cola Has Decided To Double Its Investments In Telangana, Know In Details - Sakshi
Sakshi News home page

Coco Cola Investments In Telangana: తెలంగాణలో కోకాకోల భారీ పెట్టుబడులు

Published Sat, Aug 26 2023 9:38 AM

Coca Cola To Double Its Investments In Telangana - Sakshi

తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు శీతల పానీయాల తయారీ సంస్థ కోకాకోల సిద్ధమైంది. ఇటీవల న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో కోకాకోల ప్రతినిధులు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తమ సంస్థకు భారత్‌ ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్ అని తెలిపారు. అయితే, దేశీయంగా తమ వ్యాపారాన్ని మరింతగా విస్తరించే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు కోకాకోల సంస్థ ఉపాధ్యక్షుడు జేమ్స్‌ మేక్‌ గ్రివి తెలిపారు. ఇందులో భాగంగా అమీన్పూర్ వద్ద సంస్థకు ఉన్న భారీ బాటిలింగ్ ప్లాంట్ విస్తరణ కోసం గతంలోనే 100 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టమన్నారు.

 దీనికి అదనంగా సిద్దిపేట జిల్లాలో 1000 కోట్ల రూపాయలతో నూతన బాటిలింగ్ ప్లాంట్ నిర్మాణం కోసం ఏప్రిల్ నెల 22న ప్రభుత్వంతో ఎంవోయూ కుదుర్చుకున్నామని అన్నారు. ఈ మేరకు అక్కడ సంస్థ నిర్మాణ కార్యకలాపాలను కొనసాగిస్తుందని తెలిపారు. 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన సహకారం, తమ ప్లాంట్ నిర్మాణంలో వేగం, ఈ ప్రాంతంలో వ్యాపార వృద్దిని దృష్టిలో ఉంచుకొని కోకా కోలా సంస్థ అదనంగా మరో 647 కోట్ల రూపాయలను ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న సిద్దిపేట జిల్లా ప్లాంట్ లో పెట్టేందుకు ముందుకు వచ్చింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ ప్లాంట్ డిసెంబర్ 24 నాటికి పూర్తి అవుతుందని వెల్లడించింది. 

దీంతోపాటు రాష్ట్రంలో తాజాగా రెండవ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇందులో భాగంగా కరీంనగర్/ వరంగల్ ప్రాంతంలో ఈ తయారీ కేంద్రం వచ్చే అవకాశం ఉందని సంస్థ తెలియజేసింది. 

Advertisement
Advertisement