Today Stock Market: రష్యా మొండితనం.. స్టాక్ మార్కెట్ బేజార్
Published
Wed, Mar 2 2022 10:01 AM
ముంబై: ఉక్రెయిన్పై యుద్ధం విషయంలో రష్యా మొండిపట్టు వీడకపోవడంతో స్టాక్ మార్కెట్లు నష్టపోతున్నాయి. రష్యా - ఉక్రెయిన్ల మధ్య జరిగిన మొదటి దఫా చర్చలు విఫలమైన తర్వాత ప్రపంచ దేశాలు రష్యపై ఆర్థిక ఆంక్షలు తీవ్రతరం చేశాయి. మరోవైపు రష్యా తన దాడులను ఉదృతం చేసింది. ఫలితంగా యుద్ధ పరిణామాలు మరింత సంక్షోభం దిశగా పయణిస్తున్నాయి. క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు జాగ్రత్త పడటానికే ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ప్రపంచ మార్కెట్లలో జోరు తగ్గింది, ఏషియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి.
ఉదయం 10 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 750 పాయింట్లు నష్టపోయి 55,497 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. గత రెండు రోజులుగా వచ్చిన లాభాలు హుష్ కాకి అయ్యాయి. మరోసారి సెన్సెక్స్ 56 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 155 పాయింట్లు నష్టపోయింది16,638 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ఉండగా రిలయన్స్ ఇండస్ట్రీస్, పవర్గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పేయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.