Sakshi News home page

దేశీ జీ–సెక్యూరిటీలకు సై

Published Thu, Mar 7 2024 10:14 AM

Desi G  Emerging market for securities - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలో దేశీ జీ–సెక్యూరిటీలను వర్ధమాన మార్కెట్‌(ఈఎం) స్థానిక ప్రభుత్వ ఇండెక్స్, సంబంధిత సూచీలలో చేర్చనున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ తాజాగా పేర్కొంది. దీంతో ప్రభుత్వ నిధుల సమీకరణ వ్యయాలు తగ్గేందుకు వీలు చిక్కనుంది. 2025 జనవరి 31 నుంచి ఇండియన్‌ ఫుల్లీ యాక్సెసబుల్‌ రూట్‌(ఎఫ్‌ఏఆర్‌) బాండ్లను బ్లూమ్‌బెర్గ్‌ ఈఎం లోకల్‌ కరెన్సీ గవర్నమెంట్‌ ఇండెక్సులలో చోటు కలి్పంచనున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. తొలి దశలో బాండ్ల పూర్తి మార్కెట్‌ విలువకు 10 శాతం వెయిటేజీతో వీటిని చేర్చనున్నట్లు తెలియజేసింది.

 తదుపరి ఎఫ్‌ఏఆర్‌ బాండ్ల పూర్తి మార్కెట్‌ విలువకు 10 శాతం చొప్పున ప్రతీ నెలా వెయిటేజీ పెరగనున్నట్లు వివరించింది. 10 నెలలపాటు వెయిటేజీ పెరగడం ద్వారా 2025 అక్టోబర్‌కల్లా పూర్తి మార్కెట్‌ విలువకు వెయిటేజీ చేరనున్నట్లు వెల్లడించింది. బ్లూమ్‌బెర్గ్‌ ఈఎం లోకల్‌ కరెన్సీ గవర్నమెంట్‌ ఇండెక్స్, 10 శాతం కంట్రీ క్యాప్‌డ్‌ ఇండెక్స్‌తోపాటు సంబంధిత సహచర ఇండెక్సులలోనూ వీటికి చోటు కలి్పంచనున్నట్లు పేర్కొంది. 

కాగా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ 2020–21 బడ్జెట్‌ ప్రసంగంలో కొన్ని ప్రత్యేకించిన విభాగాల ప్రభుత్వ సెక్యూరిటీలు నాన్‌రెసిడెంట్‌ ఇన్వెస్టర్లకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. దేశీ ఇన్వెస్టర్లకు సైతం ఇవి అందుబాటులో ఉంటాయని, ఇండెక్సులలో లిస్ట్‌కానున్న వీటికి లాకిన్‌ అమలుకాబోదని తెలియజేశారు. బ్లూమ్‌బెర్గ్‌ ఈఎం మార్కెట్‌ 10 శాతం కంట్రీ క్యాప్‌డ్‌ ఇండెక్స్‌లో చేరాక చైనా, దక్షిణ కొరియా మార్కెట్ల జాబితాలో భారత్‌ చేరనుంది.   

Advertisement
Advertisement