Electric Car: బెంగళూరు నడిరోడ్డుపై మంటల్లో ఎలక్ట్రిక్ కారు - వీడియో వైరల్
Published
Sun, Oct 1 2023 3:09 PM
ఆధునిక కాలంలో కొత్త కార్లను కొనుగోలు చేసేవారిలో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను ఎంచుకుంటున్నారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకి పెరుగుతోంది. కానీ అక్కడక్కడా.. అప్పుడప్పుడు జరిగే కొన్ని సంఘటనలు ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల్లో భయాన్ని కలిగిస్తున్నాయి.
గతంలో ఓలా, ప్యూర్ ఈవీ, ఏథర్ కంపెనీలకు సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఛార్జింగ్ పెట్టిన సమయంలో కొన్ని కారణాల వల్ల మంటల్లో చిక్కుకున్నాయి. ఈ సంఘటనల్లో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. దీంతో కేంద్రం సంబంధిత సంస్థలు దీనికి కారణాలను వెల్లడించాలని, మళ్ళీ ఇలాంటి సంఘటనలు జరగకూడదని హెచ్చరించింది. అయితే ఈ రోజు బెంగళూరులో ఒక ఎలక్ట్రిక్ కారు కాలిపోయింది.
నివేదికల ప్రకారం, శనివారం బెంగళూరు జెపి నగర్ ప్రాంతంలోని దాల్మియా సర్కిల్ వద్ద ఎలక్ట్రిక్ కారు మంటల్లో చిక్కుకున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది మహీంద్రా e20 లాగా ఉందని కొందరు, ఎంజి కామెట్ మాదిరిగా ఉందని కొందరు చెబుతున్నారు. కానీ చాలామంది ఇది మహీంద్రా ఎలక్ట్రిక్ కారు అని అభిప్రాయపడుతున్నారు.
నది రోడ్డు మీద కాలిపోతున్న ఎలక్ట్రిక్ కారుని చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇందులో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఈ సంఘటనలో ఎవరికైనా ప్రమాదం జరిగిందా.. లేదా అనేది కూడా ఖచ్చితంగా తెలియదు. కానీ ఇందులో ఎవరికీ ప్రమాదం జరగలేదనే భావిస్తున్నాము.