స్వేచ్ఛగా ఓటు వేయాలి
సాక్షి, రంగారెడ్డిజిల్లా: లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13న జరుగనున్న పోలింగ్లో ప్రతి ఓటరు పాలుపంచుకుని, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ శశాంక పిలుపునిచ్చారు. ఈ మేరకు రాజేంద్రనగర్ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు. ఓటరు కార్డు లేకపోయినా, ఎన్నికల సంఘం నిర్దేశించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకుని ఓటు వేయొచ్చని సూచించారు. జిల్లాలో పోలింగ్ శాతం పెంచేందుకు ఇప్పటికే అన్ని నియోజకవర్గాల పరిధిలో ప్రచార, అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్టు చెప్పారు. గత ఎన్నికల్లో తక్కువ పోలింగ్ నమోదైన అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. ప్రలోభాలకు ఆస్కారం లేకుండా పోలింగ్కు 72 గంటల ముందు నుంచి నిఘా ముమ్మరం చేసినట్టు కలెక్టర్ తెలిపారు. లోక్సభ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 2,877 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని.. ప్రతి పోలింగ్ కేంద్రంలో టెంట్లు, టాయిలెట్, ర్యాంపు, వీల్ చైర్, తాగునీరు, ఫ్యాన్ వంటి వసతులు కల్పించినట్టు వెల్లడించారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా, సీసీ కెమెరాల నిఘా నీడలో పోలింగ్ ఉంటుందన్నారు. 216 మంది సూక్ష్మ పరిశీలకులు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో సేవలందిస్తారని ఆయన వివరించారు.
విధుల్లో 23 వేల మంది ఉద్యోగులు
ఎన్నికల విధుల్లో 23,752 మంది పాల్గొననున్నట్టు కలెక్టర్ శశాంక తెలిపారు. సెక్టోరియల్, ప్రిసైడింగ్ ఆఫీసర్, సహాయ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఇప్పటికే శిక్షణ ఇచ్చామని.. వీరంతా ఆదివారం ఉదయం ఆయా పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకుని, బ్యాలెట్ బాక్సులను తీసుకుని కేటాయించిన పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారన్నారు. పోలింగ్ రోజున ఉదయం 5.30 గంటలకు రాజకీయ పార్టీల ఏజెంట్ల సమక్షంలో మాక్పోల్ ఉంటుందన్నారు. మాక్పోల్, పోలింగ్ ప్రక్రియలో ఏదైనా సాంకేతిక లోపం తలెత్తితే వెంటనే సెక్టోరల్ అధికారులకు సమాచారం ఇవ్వాలని, వీరు తమ వద్ద రిజర్వ్లో ఉంచిన యూనిట్లను సమకూర్చుతారని చెప్పారు. పోలింగ్ రోజున ఓటింగ్ శాతాన్ని ప్రతి గంటకోసారి ఎన్కోర్ యాప్లో నమోదు చేయాలని, డాక్యుమెంట్, పీఓ డైరీ, విజిట్ షీట్, మాక్ పోల్ సర్టిఫికెట్, 17 కాలమ్ ప్రొఫార్మా వంటివి తప్పులు లేకుండా చూడాలన్నారు. పోలింగ్ ముగిసిన మీదట ఈవీఎంలను జాగ్రత్తగా రిసెప్షన్ సెంటర్లకు చేర్చాలని, వాటిని సరిచూసుకుని స్ట్రాంగ్ రూమ్ల్లో భద్రపరిచే వరకు సెక్టోరల్ అధికారులు అక్కడే అందుబాటులో ఉంటారని వివరించారు.
మూడో విడత ర్యాండమైజేషన్ పూర్తి
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా శనివారం పోలింగ్ సిబ్బంది మూడో విడత ర్యాండమైజెషన్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో పూర్తి చేశారు. రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ శశాంక నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాల్లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ప్రక్రియ పూర్తి చేశారు. సాధారణ పరిశీలకుడు రాజేందర్ కుమార్ కటారియా కార్యక్రమాన్ని నిశితంగా పరిశీలించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులను, ఓపీఓలతో కూడిన బృందాలను ర్యాండమైజెషన్ ద్వారా కేటాయించారు. వీరికి ఇప్పటికే పలు విడతలుగా ఎంపిక చేసిన వివిధ కేంద్రాల్లో మాస్టర్ ట్రైనర్స్తో శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లాలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో మొత్తం 3,459 పోలింగ్ కేంద్రాలు ఉండగా, 3,796 టీములను పోలింగ్ విధుల కోసం నియమించినట్టు కలెక్టర్ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గం పరిధిలో ప్రత్యేకంగా ఐదు పోలింగ్ కేంద్రాల చొప్పున మహిళా బృందాలు, ఒక దివ్యాంగుల బృందం, ఒక యువతతో కూడిన పోలింగ్ బృందాలను ఎంపిక చేసినట్టు చెప్పారు. ఈ సందర్భంగా మైక్రో అబ్జర్వర్ల ర్యాండమైజేషన్ ప్రక్రియను సైతం పూర్తి చేశారు. కార్యక్రమంలో డీఆర్ఓ సంగీత, ఎన్ఐసీ అధికారి స్వర్ణ లత, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి శ్రీలక్ష్మి, ఎన్నికల విభాగం అధికారి సైదులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా
కలెక్టర్ శశాంక నియోజకవర్గం ఓటింగ్ కిట్ల పంపిణీ కేంద్రం స్ట్రాంగ్రూమ్స్/కౌంటింగ్ కేంద్రం
మహేశ్వరం స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజీ, నాదర్గుల్ బండారి శ్రీనివాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గొల్లపల్లి
రాజేంద్రనగర్ ఓల్డ్ వెటర్నరీ కాలేజీ, రాజేంద్రనగర్ ,,
శేరిలింగంపల్లి జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియం, గచ్చిబౌలి ,,
చేవెళ్ల బండారి శ్రీనివాసరావు ఇనిస్టిట్యూట్, గొల్లపల్లి ,,
పరిగి మినీ స్టేడియం, పరిగి ,,
వికారాబాద్ మేరీ ఏ నాట్స్ స్కూల్స్ ,,
తాండూరు సెయింట్ మార్క్స్ ఇంటర్నేషనల్ హైస్కూల్ ,,