అక్రమ ధనార్జన నిరోధక నిబంధనలు మరింత పటిష్టం! | Sakshi
Sakshi News home page

అక్రమ ధనార్జన నిరోధక నిబంధనలు మరింత పటిష్టం!

Published Thu, Sep 7 2023 7:25 AM

Finance ministry has made the anti money laundering rules more stringent - Sakshi

న్యూఢిల్లీ: అక్రమ ధనార్జన నిరోధక నియమ నిబంధనలను ఆర్థిక మంత్రిత్వశాఖ మరింత కఠినతరం చేసింది. ముఖ్యంగా భాగస్వామ్య సంస్థల్లో ‘లాభదాయక యజమానుల’ నిర్వచనం కింద గతంలో 15 శాతంగా ఉన్న వాటాను (ఒక సంస్థలో) తాజాగా 10 శాతానికి తగ్గించింది. ఇది లాభదాయకమైన యజమానులను కఠినమైన పర్యవేక్షణలోకి తీసుకువస్తుంది. 

బినామీ, షెల్‌ కంపెనీల కార్యకలాపాల నిరోధానికి దోహదపడుతుంది. అంతేకాకుండా, లాభదాయకమైన యజమానిని ‘‘ఇతర మార్గాల ద్వారా నియంత్రించే’’ వ్యక్తిగా కూడా పరిగణించడం జరుగుతుంది.  ఇక్కడ ‘‘నియంత్రణ’’ అనేది నిర్వహణ లేదా విధాన నిర్ణయాన్ని నియంత్రించే హక్కును సంబంధించినదని  ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ పేర్కొంది.

ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగానికి సమాచారాన్ని అందించడానికి బాధ్యత వహించే ’ప్రిన్సిపల్‌ ఆఫీసర్‌’ స్థాయిని.. మేనేజ్‌మెంట్‌ స్థాయి వ్యక్తికి కూడా కల్పిస్తూ అక్రమ ధనార్జన నిరోధక చట్టం, 2005 నిబంధనలను (మెయిటినెన్స్‌ ఆఫ్‌ రికార్డ్స్‌) కఠినతరం చేసినట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.

ట్రస్ట్‌ విషయంలో రిపోర్టింగ్‌ సంస్థ, ఖాతా ఆధారిత సంబంధాన్ని ప్రారంభించే సమయంలో లేదా పేర్కొన్న లావాదేవీలను నిర్వహిస్తున్నప్పుడు ధర్మకర్తలు తమ స్థితిని వెల్లడించేలా చూసుకోవాలని కూడా సవరణ పేర్కొంది. టెర్రర్‌ ఫైనాన్సింగ్, మనీలాండరింగ్‌ ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ ఫోర్స్‌ (ఎఫ్‌ఏటీఎఫ్‌) నవంబర్‌లో కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవలి నెలల్లో వివిధ మనీలాండరింగ్‌ నిరోధక నిబంధనలను కఠినతరం చేస్తున్న సంగతి తెలిసిందే. 

Advertisement

తప్పక చదవండి

Advertisement