2026 ఆఖర్లో టాటా ‘ధోలేరా’ చిప్‌ | Sakshi
Sakshi News home page

2026 ఆఖర్లో టాటా ‘ధోలేరా’ చిప్‌

Published Thu, Mar 14 2024 5:29 AM

First chip from Tata Dholera plant will be out in December 2026 - Sakshi

టాటా, సీజీ పవర్‌ సెమీకండక్టర్ల ప్లాంట్ల శంకుస్థాపనలో కేంద్ర మంత్రి వైష్ణవ్‌ వెల్లడి

ధోలేరా (గుజరాత్‌): టాటా ఎల్రక్టానిక్స్‌ తలపెట్టిన ధోలేరా (గుజరాత్‌) ప్లాంటు నుంచి చిప్‌ల తొలి బ్యాచ్‌ 2026 డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి రాగలదని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ తెలిపారు. ఈ ప్లాంటులో 28, 50, 55 నానోమీటర్‌ నోడ్‌ల చిప్స్‌ తయారు కానున్నాయని పేర్కొన్నారు. టాటా గ్రూప్‌నకు చెందిన రెండు, సీజీ పవర్‌కి చెందిన ఒక చిప్‌ ప్లాంటుకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపన చేసిన సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు.

ఈ మూడింటిపై కంపెనీలు మొత్తం రూ. 1.26 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నాయి. మూడు భారీ సెమీకండక్టర్ల ప్లాంట్లకు ఒకే రోజున శంకుస్థాపన చేయడం రికార్డని మంత్రి చెప్పారు. 2029 నాటికి టాప్‌ 5 సెమీకండక్టర్ల వ్యవస్థల్లో భారత్‌ ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టాటా ఎల్రక్టానిక్స్‌ సెమీకండక్టర్ల ప్రాజెక్టులతో అస్సాంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 72,000 పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగగలదని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ తెలిపారు.

 

Advertisement
Advertisement