ఇంటెల్ ఇండియా మాజీ చీఫ్‌ మృతి.. సైకిల్‌పై వెళ్తుండగా ఏమైందంటే.. | Sakshi
Sakshi News home page

ఇంటెల్ ఇండియా మాజీ చీఫ్‌ మృతి.. సైకిల్‌పై వెళ్తుండగా ఏమైందంటే..

Published Thu, Feb 29 2024 1:16 PM

Former Intel India Head Avtar Saini Killed In Cycling Accident - Sakshi

ఇంటెల్ ఇండియా మాజీ హెడ్ అవతార్ సైనీ(68) మహారాష్ట్రలోని నవీ ముంబై టౌన్‌షిప్‌లో కన్నుముశారు. ఆయన సైకిల్‌పై వెళుతుండగా వేగంగా వచ్చిన క్యాబ్ ఢీకొట్టడంతో మృతి చెందినట్లు పోలీసులు గురువారం తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం..బుధవారం తెల్లవారుజామున 5:50 గంటలకు సైనీ తన సహచరులతో కలిసి నెరుల్ ప్రాంతంలోని పామ్ బీచ్ రోడ్డులో సైకిల్‌పై వెళుతున్నారు. వేగంగా వస్తున్న క్యాబ్ సైనీ సైకిల్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ తర్వాత క్యాబ్‌ డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పటికే కిందపడిన సైకిల్ ఫ్రేం క్యాబ్ ముందు చక్రాల కింద ఇరుక్కుపోయిందని ఓ పోలీసు అధికారి తెలిపారు.

ఈ ఘటనలో సైనీకి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే తోటి సైక్లిస్టులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు చెప్పారు. 

ఇదీ చదవండి: ఆన్‌లైన్‌లో ఆవులు.. ఊరించిన ఆఫర్‌.. తీరా చూస్తే..

సైనీ ఇంటెల్ 386, 486 మైక్రోప్రాసెసర్‌ల అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు. కంపెనీ పెంటియమ్ ప్రాసెసర్ రూపకల్పనకు ఆయన నాయకత్వం వహించారు. ఇంటెల్‌ దక్షిణాసియా విభాగానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఆయన సతీమణి మూడేళ్ల క్రితమే చనిపోయారు. కుమార్తె, కుమారుడు అమెరికాలో నివాసముంటున్నారు. సైనీ మృతిపై ఇంటెల్ ఇండియా తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement