ఇండియన్ టెకీలకు గిట్హబ్ షాక్: టీం మొత్తానికి ఉద్వాసన
Published
Tue, Mar 28 2023 1:29 PM
న్యూఢిల్లీ: ప్రముఖ డెవలపర్ ప్లాట్ఫారమ్ గిట్హబ్ మొత్తం భారతీయ ఇంజనీరింగ్ బృందాన్ని తొలగించనుంది. ఈ మేరకు గిట్హబ్ సీఈవో థామస్ దోమ్కే ఉద్యోగులకు ఈమెయిల్ సమాచారం అందించారు. ప్రపంచ మార్కెట్ పరిస్థితులు ఖర్చులను తగ్గించుకొనే క్రమంలో మైక్రోసాఫ్ట్ యాజమాన్యంలోని గిట్హబ్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. "పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక" లో భాగంగా తీసుకున్న ఈ చర్యతో కనీసం 100 మంది భారతీయులు ఉద్యోగాలను కోల్పోనున్నారు.
అమెరికా తరువాత రెండో అతిపెద్ద డెవలపర్ సెంటర్గా ఉన్న భారతీయ టీం మొత్తాన్ని తొలగించడం ఆందోళన రేపింది. అయితే ప్రతి వ్యాపారానికి స్థిరమైన వృద్ధి ముఖ్యమని సీఈవో ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో వెల్లడించారు. ప్రస్తుతం 100 మిలియన్ల డెవలపర్లున్నారు. రేపటి ప్రపంచానికి డెవలపర్-ఫస్ట్ ఇంజినీరింగ్ సిస్టమ్గా సంస్థ మారాల్సి ఉందన్నారు. తమ కస్టమర్లు GitHubతో వృద్ధి చెందేందుకు, వారి క్లౌడ్ అడాప్షన్ జర్నీని వేగవంతం, సరళీకృతం చేయడంలో సహాయపడటం కొనసాగించాలని సీఈవో తెలిపారు. (ఎలాన్ మస్క్కు మరో ఎదురుదెబ్బ: సోర్స్ కోడ్ లీక్ కలకలం)
గత నెల ప్రారంభంలో గిట్హబ్ ప్రకటించిన విస్తృత క్రమబద్ధీకరణ ప్రయత్నంలో ఈ తొలగింపు భాగం కావచ్చని అంచనా. మార్చితో ముగిసే త్రైమాసికం నాటికి దాదాపు 10శాతం ఉద్యోగులను తగ్గించనున్నట్లు ఇంతకుముందే (ఫిబ్రవరిలో) సంస్థ ప్రకటించింది.