పెరుగుతున్న ఉల్లి ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం | Sakshi
Sakshi News home page

Onion Prices: పెరుగుతున్న ఉల్లి ధరలు.. కేంద్రం కీలక నిర్ణయం

Published Sat, Aug 19 2023 9:49 PM

Govt imposes 40 pc export duty on onion to increase local supply - Sakshi

దేశంలో ఉల్లి ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయంగా లభ్యతను పెంచేందుకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకాన్ని విధించింది. ఉల్లిపై కేంద్రం ఎగుమతి సుంకం విధించడం ఇదే తొలిసారి. వంటల్లో ప్రధానంగా ఉపయోగించే ఉల్లి ధర ప్రస్తుతం (ఆగస్ట్‌ 19)​ ఢిల్లీలో కిలోకు రూ. 37కి చేరింది. 

2023 డిసెంబర్ 31 వరకు ఉల్లిపాయలపై 40 శాతం ఎగుమతి సుంకాన్ని విధిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ కస్టమ్స్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 4 వరకు భారత్‌ నుంచి 9.75 లక్షల టన్నుల ఉల్లి ఎగుమతులు జరిగాయి. విలువ పరంగా చూస్తే వీటిని అత్యధికంగా దిగుమతి చేసుకున్న మొదటి మూడు దేశాలు బంగ్లాదేశ్, మలేషియా, యూఏఈ.

రానున్న పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని దేశీయ మార్కెట్‌లో ఉల్లి లభ్యతను పెంచేందుకు ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధించాలని నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. వినియోగదారుల వ్యవహారాల శాఖ లెక్కల ప్రకారం.. ఆగస్ట్‌ 19న దేశంలో ఉల్లి సగటు రిటైల్ ధర కిలోకు కనిష్టంగా రూ. 30గా ఉంది. ఇది గరిష్టంగా రూ. 63, కనిష్టంగా రూ. 10లుగా ఉంది.

ఇదీ చదవండి: Revised I-T rules: ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌: ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నిబంధనల్లో మార్పులు.. భారీగా పన్ను ఆదా! 

Advertisement
Advertisement