ఆటో పీఎల్‌ఐ నోటిఫికేషన్‌ విడుదల | Sakshi
Sakshi News home page

ఆటో పీఎల్‌ఐ నోటిఫికేషన్‌ విడుదల

Published Sat, Sep 25 2021 3:04 AM

Heavy Industries Ministry notifies PLI scheme for auto sector - Sakshi

న్యూఢిల్లీ: అత్యాధునిక ఆటోమోటివ్‌ టెక్నాలజీ ఆధారిత వాహనాలు (ముందస్తు అనుమతి కలిగిన), అన్ని రకాల ఆటో విడిభాగాల తయారీపై ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్‌ఐ పథకం) అందుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఆటోమొబైల్‌ రంగానికి రూ.25,938 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు ఇటీవలే ప్రకటించగా.. ఇందుకు సంబంధించి పీఎల్‌ఐ పథకం కింద రాయితీలు కలి్పంచే నోటిఫికేషన్‌ను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ శుక్రవారం జారీ చేసింది. సైనిక వినియోగానికి సంబంధించిన వాహనాలకూ ఈ పథకం కింద ప్రయోజనాలు లభించనున్నాయి.

సీకేడీ/ఎస్‌కేడీ కిట్లు, ద్విచక్ర, త్రిచక్ర, ప్యాసింజర్, వాణిజ్య, ట్రాక్టర్ల అగ్రిగేట్స్‌ సబ్సిడీలకు అర్హతగా నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఆటోమొబైల్‌ కంపెనీలతోపాటు.. కొత్త నాన్‌ ఆటోమోటివ్‌ పెట్టుబడి సంస్థలూ పథకం కింద ధరఖాస్తు చేసుకోవచ్చు. ఛాంపియన్‌ ఓఈఎం, కాంపోనెంట్‌ చాంఫియన్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌ అనే రెండు భాగాల కింద ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఒక గ్రూపు పరిధిలోని కంపెనీలకు మొత్తం ప్రోత్సాహకాల్లో 25 శాతానికి మించకుండా (అంటే రూ.6,485 కోట్లకు మించకుండా) ప్రోత్సాహకాలు లభిస్తాయి. చాంపియన్‌ ఓఈఎం పథకం కింద విక్రయాలు కనీసం రూ.125 కోట్లుగాను, కాంపోనెంట్‌ చాంపియన్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌ కింద విక్రయాలు కనీసం రూ.25 కోట్లుగాను ఉండాలని ఈ నోటిఫికేషన్‌ స్పష్టం చేస్తోంది.  

Advertisement
Advertisement