List of All the Cars and Bikes to Get Expensive From January 2022 - Sakshi
Sakshi News home page

2022లో పెరగనున్న కార్లు, బైక్స్‌ కంపెనీల జాబితా ఇదే..!

Published Mon, Dec 27 2021 3:58 PM

List Of All The Cars And Bikes To Get Expensive From January 2022 - Sakshi

భారత్‌లో వచ్చే ఏడాది జనవరి నుంచి ఆయా వాహనాల ధరలు భారీగా పెరగనున్నాయి. కార్లతో పాటుగా టూవీలర్‌ వాహనాల ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి.  ఇప్పటికే ఆయా ఆటోమొబైల్‌ కంపెనీలు ధరల పెంపు అనివార్యమని ప్రకటించాయి. అధిక ఇన్‌పుట్, లాజిస్టిక్స్ ఖర్చులు అలాగే సరఫరా అంతరాయాలు మార్జిన్‌లను దెబ్బతీస్తున్నందున, భారత్‌లోని దిగ్గజ ఆటోమొబైల్‌ కంపెనీలు వాహనాల ధరలను పెంచుతున్నట్లు తెలుస్తోంది. ముడి సరకుల ధరలు పెరగడంతో 2021 ఏడాది పొడవునా​ అనేకసార్లు ఆటోమొబైల్‌ కంపెనీలు ధరలను పెంచాయి.

2022 నుంచి ధరలను పెంచనున్న కంపెనీలు..!

మారుతీ సుజుకి: మారుతీ సుజుకి ఇండియా లిమిటెడ్ ఈ నెల ప్రారంభంలో తన అన్ని మోడళ్లకు జనవరి 2022 నుంచి ధరల పెంపును ప్రకటించింది. భారత అతిపెద్ద కార్ల తయారీ సంస్థ తాజా ధరల పెంపునకు వాహనాల తయారీ వ్యయం పెరగడమే కారణమని పేర్కొంది. 

హీరో మోటోకార్ప్: భారతదేశపు అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ వచ్చే ఏడాది జనవరి 4 నుంచి తమ మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. స్ప్లెండర్ బైక్ల తయారీకోసం క్రమంగా పెరుగుతున్న వస్తువుల ధరలే దీని కారణమని తెలుస్తోంది. 

టాటా మోటార్స్: స్వదేశీ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్‌ తన ప్యాసింజర్ కార్ల ధరలను జనవరి 2022 నుంచి పెంచనుంది. టాటా కార్లపై రానున్న ధరల పెంపు ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు ఐసీఈ ప్యాసింజర్ కార్లకు కూడా వర్తించనుంది.

డుకాటి ఇండియా: రేసింగ్‌ బైక్స్‌లో పేరుగాంచిన ఇటాలియన్‌ బైక్‌ మేకర్‌ డుకాటి ఇండియా వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భారత్‌లో తన అన్ని మోడల్స్/వేరియంట్‌ల ధరలను పెంచనుంది. దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన తొమ్మిది డీలర్‌షిప్‌లలో డుకాటి బైక్స్‌ ధరలు పెరగనున్నాయి.

ఆడి ఇండియా: విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి ఇండియా 2022 జనవరి 1 నుంచి తన మోడళ్ల ధరలను పెంచబోతోంది. కంపెనీలోని  ఆయా కార్ల ధరలు మూడు శాతం మేర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

టయోటా: టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తన కార్ల ధరలను జనవరి 1, 2022 నుంచి పునఃసమీక్షించనుంది. ముడి పదార్థాలతో సహా ఇన్‌పుట్ ఖర్చులలో నిరంతర పెరుగుదలను సమీక్షించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ఈ నెల ప్రారంభంలో పంపిన ప్రెస్ నోట్‌లో తెలిపింది.

కవాసకి: డుకాటితో పాటు, కవాసకి కూడా జనవరి 1, 2022 నుంచి భారత్‌లోతన మోడళ్లలో ధరలను పెంచనుంది. గతంలో ఆగస్టు 2021లో కవాసకి తన ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచింది. 

వీటితో పాటుగా సిట్రోయెన్ ఇండియా, స్కోడా , వోక్స్‌వ్యాగన్ వంటి ఇతర ఓఈఎమ్స్‌ కూడా వచ్చే ఏడాది నుంచి ధరలను పెంచనున్నాయి. 

చదవండి: అలర్ట్‌: జనవరిలో నెలలో బ్యాంక్‌ హాలిడేస్‌..! ఎన్ని రోజులంటే..!

Advertisement
Advertisement