కరోనా : మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లకు మహీంద్రా షాక్‌  | Sakshi
Sakshi News home page

కరోనా : మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లకు మహీంద్రా షాక్‌ 

Published Wed, Mar 10 2021 11:20 AM

Mahindra fires 300 executives as slowdown stings - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ ఆటో మేజర్ మహీంద్రా అండ్‌ మహీంద్రా వందలమంది ఎగ్జిక్యూటివ్‌లకు భారీ షాక్‌ ఇచ్చింది. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా సంక్షోభంలో చిక్కుకున్న సంస్థ   మూడు వందలమంది మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌లకు ఉద్వాసన పలికింది.  ముఖ్యంగా మహీంద్రా మొబిలిటీ సర్వీసెస్ అధ్యక్షుడు గ్రూప్ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడు వీఎస్‌ పార్థసారధి సహా పలువురు సీనియర్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్‌లు ఇందులో ఉన్నారు. మహీంద్రా వ్యాపార ప్రణాళిక విభాగాధిపతి ప్రహ్లాద రావు ,ఇతర సీనియర్ స్థాయి అధికారులు కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై ఎంఅండ్‌ఎం అధికారిక ధృవీకరణ ఏదీ ప్రస్తుతానికి లేదు.

వాహనాల విక్రయాల్లో క్షీణత నేపథ్యంలో మహీంద్రా ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా దేశీయ ఆటోమోటివ్ పరిశ్రమలో మందగమనానికి తోడు కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌  ప్రభావం తీవ్రంగా పడింది. పునర్నిర్మాణ చర్యల్లో భాగంగా ప్రస్తుతానికి ఆటో, వ్యవసాయ విభాగానికి మాత్రమే పరిమితమైన ఈ కోతలు మహీంద్రా రీసెర్చ్ వ్యాలీకి  కూడా పాకనుందనే ఆందోళన నెలకొంది. మహీంద్రా ఆటోమోటివ్ విభాగం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు అమ్మకాలలో 27.52 శాతం క్షీణించింది. పరిశ్రమల పరిమాణం 13.2 శాతం తగ్గింది. అయితే ఫిబ్రవరిలో ప్రయాణీకుల వాహన రిటైల్ అమ్మకాలు 10.6శాతం పెరగగా, ద్విచక్ర వాహన విక్రయాలు 16.08 శాతం తగ్గాయి. టాటా యాజమాన్యంలోని జాగ్వార్ ల్యాండ్ రోవర్ భారతదేశంలో మూడింట ఒకవంతు సిబ్బందిని తొలగించిన సంగతి తెలిసిందే.

Advertisement
Advertisement