భారత సైన్యం కోసం మారుతి జిప్సీ ఎలక్ట్రిక్ వెహికల్ - పూర్తి వివరాలు
Published
Sat, Apr 22 2023 8:53 PM
ఇండియన్ ఆర్మీ ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి భద్రతకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తుంది. ఇందులో భాగంగానే ఆర్మీ కమాండర్స్ కాన్ఫిరెన్స్ (ACC) నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం 2023 ఏప్రిల్ 17 నుంచి 21 వరకు ఢిల్లీలో ఈ కార్యక్రమం నిర్వహించింది. ఆర్మీ కమాండర్లు, ఇతర ఉన్నతాధికారులు డిజిటల్ సెషన్లో పాల్గొన్నారు.
ఈ కాన్ఫిరెన్స్ చివరి రోజు మారుతి సుజుకి జిప్సీ రెట్రోఫిట్డ్ ఎలక్ట్రిక్ వెర్షన్ దర్శనమిచ్చింది. నిజానికి ఇది ఇండియన్ ఆర్మీ సెల్, ఐఐటీ ఢిల్లీ & టాడ్పోల్ ప్రాజెక్ట్స్ అనే స్టార్టప్ పాతకాలపు మిలిటరీ జిప్సీ SUVని ఎలక్ట్రిక్ వెహికల్ మాదిరిగా మార్చడానికి సహకరించింది. ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లు విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో భాగంగానే ఇది పుట్టుకొచ్చింది.
ఇప్పటికే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో ప్రవేశపెడుతున్నాయి. అదే సమయంలో కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా రూపొందించే క్రమంలో బిజీగా ఉన్నాయి. పాత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చడానికి స్టార్టప్ ఇంజిన్ను తీసివేసి మార్చాల్సి ఉంటుంది. ఇది వాహనం జీవిత కాలాన్ని మరింత పెంచడంలో సహాయపడుతుంది.
ఇటీవల కాలంలో అమలులోకి వచ్చిన మోటారు వెహికల్ యాక్ట్ కింద వ్యక్తిగత కారును 15 సంవత్సరాల పాటు ఉపయోగించవచ్చు. ఆ తరువాత స్క్రాప్ చేయాల్సి ఉంటుంది. 2015లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఢిల్లీ-ఎన్సిఆర్ హైవేలపై 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పాత డీజిల్ వాహనాలను అనుమతించరాదని ప్రకటించింది.