5 కిలోమీటర్ల జోజిలా సొరంగ నిర్మాణం పూర్తి

17 Jan, 2022 06:37 IST|Sakshi

ఎంఈఐఎల్‌ అరుదైన రికార్డు

హైదరాబాద్‌: మౌలిక రంగ నిర్మాణ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఈఐఎల్‌) అరుదైన మైలురాయిని చేరుకుంది. 18 కిలోమీటర్ల పొడవైన జొజిలా టన్నెల్స్‌ మార్గంలో 5 కిలోమీటర్ల మేర సొరంగ నిర్మాణ పనులను పూర్తి చేసింది. రికార్డు స్థాయిలో 14 నెలల్లోనే దీన్ని సాధించినట్టు ఎంఈఐఎల్‌ ప్రకటించింది. జాతీయ రహదారులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌  (ఎన్‌హెచ్‌ఐడీసీఎల్‌) నుంచి ఈ ప్రాజెక్టును ఎంఈఐఎల్‌ సొంతం చేసుకోవడం గమనార్హం. ఆసియాలోనే అతిపెద్ద టన్నెల్‌ మార్గం అయిన ఇది పూర్తయితే, శ్రీనగర్‌–లద్దాక్‌ మధ్య ఏడాది పొడవునా ఎలాంటి అవాంతరాల్లేకుండా రవాణాకు వీలు కలుగుతుంది.

జొజిలా టన్నెల్స్‌ పరిధిలో నీల్‌గ్రార్‌ 1, 2, జోజిలా ప్రధాన సొరంగం నిర్మాణాన్ని అననుకూల వాతావరణ పరిస్థితుల్లోనూ వేగంగా అమలు చేస్తున్నట్టు ఎంఈఐఎల్‌ తెలిపింది. ఇందులో నీల్‌ గ్రార్‌  టన్నెల్‌ 1లో 915 మీటర్లకు గాను మొత్తం పని పూర్తయింది. నీల్‌ గ్రార్‌ టన్నెల్‌ 2 లో  3907 మీటర్లకు గాను 2573 మీటర్ల పని పూర్తయింది. ఇక, జోజిలా ప్రధాన టన్నెల్‌ లో 13145 మీటర్లకు గాను 1523 మీటర్ల పని పూర్తయింది. మొత్తం 18 కిలోమీటర్ల టన్నెల్‌ పనులకు 5 కిలోమీటర్ల టన్నెల్‌ పనులను అతి స్వల్ప వ్యవధిలోనే మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ పూర్తి చేయటం విశేషం.  

మరిన్ని వార్తలు