రుణాలపై పర్యవేక్షణ కీలకం | Sakshi
Sakshi News home page

రుణాలపై పర్యవేక్షణ కీలకం

Published Mon, Apr 3 2023 5:01 AM

Monitoring of loans is crucial says Ministry of Finance - Sakshi

న్యూఢిల్లీ: అమెరికా, యూరప్‌లోని కొన్ని అంతర్జాతీయ బ్యాంకుల వైఫల్యం నేపథ్యంలో అగ్రశ్రేణి రుణాలపై సరైన పర్యవేక్షణ ఉండాలని, బడా కార్పొరేట్‌లు తాకట్టు పెట్టిన షేర్లకు సంబంధించి తగిన కేటాయింపులు (ప్రొవిజనింగ్‌) చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులను (పీఎస్‌బీ) ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కోరింది. సమయానుకూల చర్యలను తీసుకోడానికి తాకట్టు పెట్టిన సెక్యూరిటీల మార్కెట్‌ డేటాను ఏకీకృతం చేయాల్సిన అవసరం ఉందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. 

ఈ తరహా చొరవలు తక్షణం సవాళ్ల నిర్వహణకు  దోహదపడే విధంగా ఉంటుందని తెలిపింది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ గత వారం పలు ఆర్థిక పరిస్థితులు, అంతర్జాతీయ అంశాలపై బ్యాంకింగ్‌ చీఫ్‌లతో సమా వేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. సంక్షోభ నిర్వహణ,  కమ్యూనికేషన్‌ వ్యూహాలను రూపొందించడానికి తగిన అవకాశాలను అన్వేషించాలని ఈ సందర్భంగా ఆమె బ్యాంకింగ్‌కు విజ్ఞప్తి చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement