నిరర్థక ఆస్తులు తగ్గితేనే డివిడెండ్‌..! ఆర్‌బీఐ కొత్త నిబంధన | Sakshi
Sakshi News home page

నిరర్థక ఆస్తులు తగ్గితేనే డివిడెండ్‌..! ఆర్‌బీఐ కొత్త నిబంధన

Published Wed, Jan 3 2024 10:36 AM

New Rules On Bank Dividend - Sakshi

ముంబై: వాటాదారులకు డివిడెండ్‌ పంపిణీ విషయంలో బ్యాంక్‌లకు ఆర్‌బీఐ కొత్త నిబంధనలను ప్రతిపాదించింది. నికర నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు) 6 శాతం కంటే తక్కువగా ఉంటే, అవి డివిడెండ్‌ పంపిణీ చేసుకోవచ్చని పేర్కొంది. చివరిగా 2005లో సవరించిన నిబంధనల ప్రకారం ఇప్పటి వరకు బ్యాంక్‌లు వాటి నికర ఎన్‌పీఏలు 7 శాతంలోపుంటే డివిడెండ్‌ పంపిణీ చేసుకోవచ్చు.

ఒక ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్‌ పంపిణీ చేసుకోవాలంటే నికర ఎన్‌పీఏలు 6 శాతంలోపు ఉండాలని ముసాయిదా ప్రతిపాదనల్లో ఆర్‌బీఐ పేర్కొంది. అలాగే, డివిడెండ్‌ పంపిణీలో గరిష్ట పరిమితిని లాభాల్లో 40 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. కాకపోతే ఈ గరిష్ట పరిమితి మేరకు డివిడెండ్‌ పంచాలంటే నికర ఎన్‌పీఏలు సున్నాగా ఉండాలి. డివిడెండ్‌ పంపిణీకి సంబంధించి తాత్కాలిక ఉపశమనం అభ్యర్థనలను అమోదించేది లేదని పేర్కొంది.

ఇదీ చదవండి: అన్నింటి​కి ఒకే కార్డు.. ప్రత్యేకతలివే..

డివిడెండ్‌ పంపిణీకి అర్హత పొందాలంటే వాణిజ్య బ్యాంక్‌ క్యాపిటల్‌ అడెక్వెసీ రేషియో 11.5 శాతంగా ఉండాలి. అదే ఫైనాన్స్‌ బ్యాంక్‌లు, పేమెంట్‌ బ్యాంక్‌లకు 15 శాతంగా, లోకల్‌ ఏరియా బ్యాంక్‌లు, రీజినల్‌ రూరల్‌ బ్యాంక్‌లకు 9 శాతంగా ఉండాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. విదేశీ బ్యాంక్‌లు ఆర్‌బీఐ అనుమతి లేకుండానే తమ లాభాలను మాతృ సంస్థకు పంపుకునేందుకు కూడా అనుమతించనుంది. 2024–25 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ ప్రతిపాదిత నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వీటిని బ్యాంక్‌ల బోర్డులు కచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. బాసెల్‌ 3 ప్రమాణాలు, కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణ (పీసీఏ) అమలు నేపథ్యంలో మార్గదర్శకాలను ఆర్‌బీఐ సమీక్షించింది.

Advertisement
Advertisement