పతంజలి పెట్టుబడుల బాట | Sakshi
Sakshi News home page

పతంజలి పెట్టుబడుల బాట

Published Tue, Jun 20 2023 6:27 AM

Patanjali Foods to invest up to Rs 1500 cr on capex in next five years - Sakshi

న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం పతంజలి ఫుడ్స్‌ పెట్టుబడుల బాట పట్టింది. రానున్న ఐదేళ్లలో రూ. 1,500 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ సీఈవో సంజీవ్‌ ఆస్తానా తెలియజేశారు. ప్రధానంగా ఆయిల్‌ పామ్‌ బిజినెస్‌ను పెంచుకునేందుకు నిధులను వెచి్చంచనున్నట్లు పేర్కొన్నారు. గతంలో రుచీ సోయాగా కార్యకలాపాలు కొనసాగించిన కంపెనీ రానున్న ఐదేళ్లలో రూ. 50,000 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు విభిన్న ప్రొడక్టుల విడుదల, పంపిణీని విస్తరించడం తదితర ప్రణాళికలు అమలు చేస్తోంది. ఇప్పటికే కంపెనీ తగినన్ని పెట్టుబడి వ్యయాలతో సామర్థ్య విస్తరణ చేపట్టినట్లు సంజీవ్‌ ప్రస్తావించారు.

దీంతో తొలినాళ్లలో కంటే చివరి రెండేళ్లలో అధికంగా పెట్టుబడులు వెచి్చంచనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం కంపెనీ 64,000 హెక్టార్లలో చేస్తున్న సాగు ద్వారా తగిన ప్రతిఫలాన్ని అందుకున్నట్లు వెల్లడించారు. వెరసి ఆయిల్‌ పామ్‌ ప్లాంటేషన్‌ భారీ బిజినెస్‌గా ఆవిర్భవించినట్లు వెల్లడించారు. వంటనూనెల జాతీయ మిషన్‌లో భాగంగా భవిష్యత్‌లో ఐదు లక్షల హెక్టార్ల ప్లాంటేషన్‌కు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. ఈశాన్య ప్రాంతంలోని అస్సామ్, అరుణాచల్‌ ప్రదేశ్, మిజోరం, త్రిపుర, నాగాలాండ్‌లలో వీటిని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. దక్షిణాదిలో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో భారీ సాగును నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ బాటలో తెలంగాణ, కర్ణాటకలోనూ పామాయిల్‌ ప్లాంటేషన్‌కు తెరతీయగా.. ఒడిషా, చత్తీస్‌గఢ్, గుజరాత్‌ తదితర రాష్ట్రాలలోనూ విస్తరించే ప్రణాళికల్లో ఉన్నట్లు వివరించారు.

Advertisement
Advertisement