రియల్టీలో పిరమల్‌ గ్రూప్‌ వేల కోట్ల పెట్టుబడులు! | Sakshi
Sakshi News home page

రియల్టీలో పిరమల్‌ గ్రూప్‌ వేల కోట్ల పెట్టుబడులు!

Published Mon, Dec 26 2022 8:11 AM

Piramal Realty to invest Rs 3500 cr in 2 years - Sakshi

న్యూఢిల్లీ: పిరమల్‌ గ్రూప్‌నకు చెందిన రియల్టీ కంపెనీ పిరమల్‌ రియల్టీ వచ్చే రెండేళ్లలో రూ.3,500 కోట్లు పెట్టుబడి చేస్తోంది. 60 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం కస్టమర్లకు అందించాలన్న లక్ష్యంతో నిర్మాణంలో ఉన్న నాలుగు రెసిడెన్షియల్‌ ప్రాజెక్టులకు ఈ మొత్తాన్ని ఖర్చు చేయనున్నట్టు పిరమల్‌ రియల్టీ సీఈవో గౌరవ్‌ సాహ్నే తెలిపారు. 

‘ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో ప్రస్తుతం 1.5 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో గృహ, వాణిజ్య సముదాయాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇందులో 1.3 కోట్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో ములంద్, థానే, మహాలక్ష్మి, బైకులా వద్ద గృహ సముదాయాలు నిర్మితమవుతున్నాయి. ఈ నాలుగు ప్రాజెక్టులకుగాను 12,000 యూనిట్ల అపార్ట్‌మెంట్స్‌ రానున్నాయి. తొలి 1,000 యూనిట్లు కస్టమర్లకు అందించడం ప్రారంభం అయింది’ అని తెలిపారు.

 గృహ రుణాలపై వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ హౌసింగ్‌ డిమాండ్‌ బలంగానే ఉందని గౌరవ్‌ వివరించారు. ఉమ్మడిగా ప్రాజెక్టుల అభివృద్ధి కోసం భూ యజమానులతో భాగస్వామ్యాన్ని అన్వేషిస్తున్నామన్నారు. 

Advertisement
Advertisement