వడ్డీ రేట్లు యథాతథం: ఆర్‌బీఐ | Sakshi
Sakshi News home page

వడ్డీ రేట్లు యథాతథం: ఆర్‌బీఐ

Published Fri, Dec 4 2020 10:20 AM

RBI maintains status quo on policy rates  - Sakshi

ముంబై, సాక్షి: వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును యథాతథంగా 4 శాతం వద్దనే కొనసాగించేందుకు మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా నిర్ణయించింది. ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్షలో భాగంగా రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన ఎంపీసీ మూడు రోజులపాటు సమాశాలు నిర్వహించింది. దీనిలో భాగంగా యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ఏకగ్రీవంగా ప్రకటించింది. దీంతో రివర్స్‌ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగనుంది. 

అంచనాల సవరణ
ఈ ఆర్థిక సంవత్సరానికి(2020-21) జీడీపీపై తొలుత వేసిన -9.5 శాతం అంచనాలను ఆర్‌బీఐ తాజాగా -7.5 శాతానికి సవరించింది. ద్వితీయార్థం(అక్టోబర్‌- మార్చి)లో ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని సాధించనున్నట్లు భావిస్తోంది. ఈ బాటలో క్యూ3(అక్టోబర్‌-డిసెంబర్‌)లో 0.1 శాతం వృద్ధి సాధించవచ్చని ఊహిస్తోంది. ఇంతక్రితం 5.6 శాతం క్షీణతను అంచనా వేయడం గమనార్హం. ఇదే విధంగా క్యూ4(జనవరి- మార్చి)కి జీడీపీ వృద్ధి అంచనాలను సైతం 0.5 శాతం నుంచి 0.7 శాతానికి పెంచింది. కాగా.. క్యూ3లో రిటైల్‌ ధరలు(సీపీఐ) 6.8 శాతంగా నమోదుకావచ్చని ఆర్‌బీఐ తాజాగా అంచనా వేసింది. క్యూ4లో 5.8 శాతానికి దిగిరావచ్చని భావిస్తోంది.

Advertisement
Advertisement