Reliance Jio sends notice to 426 Million Customers, Do not Do These 6 Things- Sakshi
Sakshi News home page

జియో యూజర్లకు అలర్ట్.. 42 కోట్ల వినియోగదారులకు మెసేజ్!

Published Wed, Dec 29 2021 3:12 PM

Reliance Jio sends notice to 426 Million Customers, Do not Do These 6 Things - Sakshi

ఈ-కేవైసీ మోసాలు, నకిలీ ఎస్సెమ్మెస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ రిలయన్స్ జియో తన వినియోగదారులను కోరింది. దేశంలోని అతిపెద్ద టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ జియో తన చందాదారులకు పంపిన ఒక మెసేజ్‌లో ఇటీవల దేశంలో ఎక్కువగా జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది. కొత్త ఏడాది, పండుగుల పేరుతో వచ్చే ఆఫర్స్ లింక్స్ మీద క్లిక్ చేయవద్దు అని తెలిపింది. ఇప్పటికే ఈ ఈ-కేవైసీ మోసాలు, నకిలీ ఎస్సెమ్మెస్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని భారతి ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా మెసేజ్‌లు పంపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ క్రింద పేర్కొన్న విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలని జియో తన యూజర్లకు సూచిస్తుంది.

► ఈ-కేవైసీ వెరిఫికేషన్ పేరుతో వచ్చే కాల్స్/సందేశాలకు స్పందించవద్దు అని సూచిస్తుంది. వెరిఫికేషన్ కోసం ఏదైనా నెంబరుకు కాల్ చేయమని మిమ్మల్ని అడిగే ఆ మోసపూరిత సందేశాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలుపుతుంది.
► కేవైసీ /ఆధార్ వివరాలను అప్‌డేట్ చేయడానికి జియో కస్టమర్లు ఎలాంటి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవద్దని కోరింది. అటువంటి వాటి కోసం ఏదైనా థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేసుకోమని జియో మిమ్మల్ని ఎన్నడూ అడగదని పేర్కొంది. ఇలాంటి థర్డ్ పార్టీ యాప్ డౌన్‌లోడ్ చేయడం వల్ల మోసగాళ్ళు మీ ఫోన్‌లోని మొత్తం సమాచారాన్ని యాక్సెస్ చేసుకుంటారు అని పేర్కొంది.
► సైబర్ మోసానికి సంబంధించిన ఇటీవలి కొన్ని కేసుల్లో మోసగాళ్ళు తమను తాము జియో ప్రతినిధులుగా పేర్కొంటున్నారని తెలిపింది. అలాగే, చందాదారుల ఆధార్, బ్యాంకు ఖాతాలు మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని ఈ-కేవైసీ పేరుతో అడుగుతున్నారని, అలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. ఈ-కేవైసీ పేరుతో వచ్చే ఎస్ఎమ్ఎస్/కాల్స్ ను ఏవీ నమ్మవద్దని టెల్కో వినియోగదారులను కోరింది. 
► ఈ-కేవైసీ పేరుతో వచ్చే ఎస్ఎమ్ఎస్‌లలో ఉన్న నెంబర్లను తిరిగి కాల్ చేయవద్దని కస్టమర్లకు పేర్కొంది.
► జియో ప్రతినిధి అని చెప్పుకునే కాలర్లు పంపే లింక్స్, అటాచ్ మెంట్లపై క్లిక్ చేయవద్దని జియో కస్టమర్లకు సూచిస్తుంది.
► మైజియో యాప్‌లో మీకు సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకోవచ్చు గనుక తృతీయపక్ష యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోమని వినియోగారులను ఎన్నడూ అడగాల్సిన అవసరం లేదని కంపెనీ పేర్కొంది.

(చదవండి: చిక్కుల్లో సుందర్‌ పిచాయ్‌...! అదే జరిగితే..?)

Advertisement
Advertisement