Sakshi News home page

RenewX 2024: 150 కంపెనీలు.. 180 బ్రాండ్ల ప్రదర్శన

Published Tue, Apr 16 2024 1:07 PM

RenewX 2024 Fuelling India Renewable Energy Momentum In Southern Hub Of Hyderabad - Sakshi

పునరుత్పాదక ఇంధనం, ఎలక్ట్రానిక్‌ వాహనాల మార్కెట్‌కు సంబంధించి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ప్రదర్శనకు హైదరాబాద్‌ వేదిక కానుంది. ఏప్రిల్‌ 26, 27న హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ‘రెన్యూఎక్స్‌ 2024’(8వ ఎడిషన్‌) పేరుతో ఈవింట్‌ను జరుపనున్నారు. ప్రముఖ బీ2బీ ఎగ్జిబిషన్స్ ఆర్గనైజర్ ఇన్‌ఫార్మా మార్కెట్స్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ ప్రదర్శనలో దాదాపు 5,500 మంది వీక్షకులు, 150 కంపెనీలు పాల్గొనవచ్చని అంచనా. ఈ మేరకు సంస్థ ప్రకటన విడుదల చేసింది.

దాదాపు 180 బ్రాండ్‌లను ప్రదర్శనగా ఉంచే ఈ కార్యక్రమంలో ప్రధానంగా పునరుత్పాదక శక్తికి సంబంధించి విభిన్న విభాగాల్లో సేవలందిస్తున్న కంపెనీలు పరస్పరం సహకారం అందించుకునేలా ఏర్పాటు చేయనున్నారు. ఆయా విభాగాల్లోని నిపుణులు తమ ఆలోచనలు పంచుకునేందుకు వీలుకల్పిస్తున్నారు. దాంతో పునరుత్పాదక ఇంధన రంగానికి భవిష్యత్తులో ఎలాంటి అవకాశాలు ఉండబోతున్నాయో చర్చించనున్నారు. 

ఈ ప్రదర్శనలో ఆర్కిటెక్ట్‌లు, రియల్ ఎస్టేట్ డెవలపర్‌లు, పారిశ్రామిక వినియోగదారులు, ఫెసిలిటీ మేనేజర్‌లు, ఎనర్జీ కన్సల్టెంట్‌లు, ఇండిపెండెంట్ పవర్ ప్రొడ్యూసర్‌లు, పవర్‌ డిస్ట్రిబ్యూటర్లు/ డీలర్‌లు, సిస్టమ్ ఇన్‌స్టాలర్లు, స్థానిక అధికారులు.. ఇలా రిన్యూవెబుల్‌ ఎనర్జీతో సంబంధం ఉన్న వివిధ విభాగాలకు చెందిన వారు పాల్గొనే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్పారు.

ఇదీ చదవండి: భారత కంపెనీలతో యాపిల్‌ ఒప్పందం.. ఎందుకంటే..

ఇన్‌ఫార్మా మార్కెట్స్ ఎండీ యోగేష్ ముద్రాస్ మాట్లాడుతూ..‘2030 నాటికి భారత్‌లో వెలువడే కర్బన ఉద్గారాలు 45 శాతం కంటే తగ్గించాలనే లక్ష్యం ఉంది. 2070 నాటికి దీన్ని సున్నాకు తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలో మొత్తం పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో దాదాపు సోలార్ ఎనర్జీనే 55శాతంగా ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ రెన్యూవెబుల్‌ ఎనర్జీ అవసరాన్ని గుర్తించి ‘సుర్యఘర్‌ యోజన పథకం’ను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా దాదాపు 1కోటి ఇళ్లకు సోలార్‌ రూఫ్‌టాప్‌ సౌకర్యాన్ని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రంగం సమీప భవిష్యత్తులో మరింత వృద్ధి చెందనుంది. ఈమేరకు ‘రెన్యూఎక్స్ 2024’ కార్యక్రమం వ్యాపారులు తమ ఉత్పత్తులను మరింత వైవిధ్యంగా మార్చేలా ఉపయోగపడుతుంది’ అని ఆయన వివరించారు. ఆసక్తి ఉ‍న్న సందర్శకులు సంబంధిత వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు అందించి తమ పేరు నమోదుచేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement