అదరగొట్టిన రిలయన్స్‌ | Sakshi
Sakshi News home page

అదరగొట్టిన రిలయన్స్‌

Published Fri, Apr 30 2021 8:20 PM

RIL Q4  net profit surges to ₹13,227 crore - Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం  రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) రికార్డు  స్థాయిలో లాభాలను సాధించింది.  ముఖేశ్‌ అంబానీ నేతృత్వంలోని సంస్థ నికర లాభాల్లో   2020 సంవత్సరం క్యూ 4లో  భారీ వృద్ధిని సాధించింది. శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తరువాత ప్రకటించిన క్యూ 4 ఫలితాల్లో ఆర్‌ఐఎల్ రూ.13,227 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 6,348 కోట్ల రూపాయలు.  ఏకీకృత ఆదాయం 11 శాతం ఎగిసి 154,896 కోట్లుగా ఉంది. గత ఏడాది కంపెనీ ఆదాయం 139,535 కోట్ల రూపాయలని రిలయన్స్‌  తెలిపింది. రిలయన్స్ ఆయిల్-టు కెమికల్ వ్యాపారం 20.6శాతం వృద్ధితో , రూ.1,01,080కోట్ల ఆదాయం ఆర్జించగా, ఎబిటా రూ.11407కోట్లుగా ఉంది.  ఇది క్వార్టర్ ఆన్ క్వార్టర్ పద్దతిలో 16.9శాతం ఎక్కువ. గత ఏడాది  4,267 కోట్ల  భారీ వన్‌టైం  నష్టాలను  నమోదు చేసిన రిలయన్స్‌  ఈ ఏడాది 797 కోట్ల లాభాలను గడించడం విశేషం.  అలాగే మార్చి 31, 2021 తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుకు  7రూపాయల డివిడెండ్‌ను బోర్డు సిఫారసు చేసింది. 

ముఖ్యంగా ఆర్‌ఐఎల్‌కు చెందిన టెలికాం విభాగం రిలయన్స్ జియో నాలుగో త్రైమాసికంలో నికర లాభంలో 47.5 శాతం వృద్ధిని నమోదు  చేసి 3,508 కోట్ల రూపాయలు సాధించింది. గత ఏడాది ఇదే కాలంలో 2,379 కోట్ల రూపాయలు. కార్యకలాపాల నుండి ఏకీకృత ఆదాయం దాదాపు 19శాతం పెరిగి 18,278 కోట్ల రూపాయలకు చేరుకుంది, ఇది సంవత్సరానికి 15,373 కోట్ల రూపాయలు  అని జియో ఒక ప్రకటనలో తెలిపింది. 426 మిలియన్ల కస్టమర్లు జియో సొంతమని,  ప్రస్తుత కస్టమర్లకు మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా  ప్రజలందరికీ, గృహ,సంస్థలకు డిజిటల్ అనుభవాలను  అందించడానికి తాము కట్టబడి ఉన్నామని రిలయన్స్‌ చైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ముఖేశ్‌ అంబానీ   వ్యాఖ్యానించారు.  గత రెండు సంవత్సరాలుగా సేవలందిస్తున్న జియో.. ఇండియాను ఒక ప్రధాన డిజిటల్ సమాజంగా మార్చే కృషిని కొనసాగిస్తుందన్నారు.

చదవండి :  వెయ్యి పడకలతో కోవిడ్‌ ఆసుపత్రి: రిలయన్స్‌

Advertisement
Advertisement