Smartphone Prices: పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు

15 Sep, 2021 08:49 IST|Sakshi

న్యూఢిల్లీ: స్మార్ట్‌ఫోన్ల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే విడుదలైన మోడళ్ల ధర 7–10 శాతం అధికం కానుంది. సెమికండక్టర్‌ చిప్స్‌తోసహా ఇతర విడిభాగాల కొరత తీవ్రం కావడమే ఇందుకు కారణమని కంపెనీలు అంటున్నాయి. 

కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఇంటి నుంచి పని విధానం, ఆన్‌లైన్‌ క్లాసులు.. వెరసి సెమికండక్టర్లకు విపరీతంగా డిమాండ్‌ ఏర్పడి కొరతకు దారితీసింది. దీని ప్రభావం స్మార్ట్‌ఫోన్‌ పరిశ్రమపై కొన్ని త్రైమాసికాలు ఉంటుందని కౌంటర్‌ పాయింట్‌ రిసెర్చ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ పాఠక్‌ వెల్లడించారు. ‘నూతన మోడళ్ల రాక ఆలస్యం కావడం లేదా కొన్ని మోడళ్లే మార్కెట్లోకి వస్తాయి. అయినప్పటికీ ఈ పండుగల సీజన్‌లో డిమాండ్‌ బలంగా ఉంటుంది. 4జీ చిప్‌సెట్స్‌పైనే ప్రభావం ఉంది. డిసెంబర్‌ వరకు ఈ పరిస్థితి కొనసాగుతుంది’ అని వివరించారు.

5జీ చిప్‌సెట్ల సరఫరా కాస్త మెరుగ్గా ఉంది. మాస్‌ మార్కెట్‌ 5జీ చిప్‌సెట్స్‌ సరఫరా తక్కువగా ఉంటుంది. ‘కొరత కారణంగా పెరుగుతున్న చిప్‌ ధరలు స్మార్ట్‌ఫోన్‌ తయారీదారుల విడిభాగాల బిల్లును గణనీయంగా ప్రభావితం చేశాయి. ఇది ఇప్పుడు వినియోగదారులపై, నూతన మోడళ్ల విడుదలపైనా ఉంటుంది’ అని గార్ట్‌నర్‌ ప్రిన్సిపల్‌ అనలిస్ట్‌ కనిష్క చౌహాన్‌ అన్నారు. 

కొన్ని బ్రాండ్ల చేతుల్లోకి..
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్‌ ప్రొడక్ట్స్‌ విభాగంలో ప్రధానంగా స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్లెట్స్, ల్యాప్‌టాప్స్‌ మార్కెట్‌ కొన్ని బ్రాండ్లకే పరిమితమైంది. ఇవి పెద్ద కంపెనీలే కాదు, నిధులు, విడిభాగాల సరఫరా విషయంలోనూ అగ్రస్థానంలో ఉంటాయని ఇండియన్‌ సెల్యులార్, ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) చైర్మన్‌ పంకజ్‌ మొహింద్రూ తెలిపారు.

చదవండి: ఐఫోన్‌ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో..

మరిన్ని వార్తలు