ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్కు తెలంగాణ హైకోర్టు నోటీస్ - కారణం ఏంటంటే?
Published
Tue, Jun 20 2023 8:18 AM
Telangana High Court Notice to RBI Governor: కోర్టు ధిక్కరణ కేసులో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గతంలో జారీ చేసిన కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదంటూ ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ వాటాదారులు కోర్టుకు వెళ్లారు. దీనిపైన జస్టిస్ భాస్కర్ రెడ్డి విచారణ చేపట్టి.. ఆదేశాలను ఎందుకు అమలు చేయలేదో 2023 జులై 07 లోపల వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
బ్యాంక్ పాలకవర్గ ఎన్నికలకు సంబంధించి మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్ షేర్హోల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి బ్యాంకు నిధులు దుర్వినియోగమయ్యాయని వెల్లడించింది. వినియోగదారుల రక్షణ కోసం బ్యాంకు రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు అధికారిని నియమించాలని ఆర్బీఐని కోర్టు అప్పట్లోనే ఆదేశించింది. కానీ ఇప్పటి వరకు అధికారిని నియమించకపోవడంతో ఉద్దేశపూర్వకంగానే కోర్టు ఆదేశాలను అమలు చేయలేదని, ఇది కోర్టు ధిక్కారంగా పరిగణించి అధికారులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టును కోరింది. ఈ కారణంగానే శక్తికాంతదాస్కు కోర్టు నోటీసులు జారీ చేసింది.