Sakshi News home page

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ ప్రాజెక్ట్..!

Published Sun, Feb 13 2022 2:50 PM

Telangana: Minister KTR to Lay the Foundation Stone For Genpact Campus in Uppal - Sakshi

హైదరాబాద్: మహానగరం వేగంగా విస్తరిస్తుండటంతో పాటు అభివృద్ధిలో దూసుకపోతోంది. ఈ మహా నగరం ఇప్పటికే ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ కంపెనీలకు అడ్డాగా తెలంగాణను మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఫలితంగా స్టార్టప్ కంపెనీలతో పాటు అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే.. ఇప్పటి వరకు హైటెక్ సిటీ వరకు మాత్రమే పరిమితమైన ఐటీ కంపెనీలు.. ఇప్పుడు నగరం నలుమూలాల విస్తరిస్తున్నాయి. తాజాగా.. ప్రముఖ ఐటీ కంపెనీ జెన్‌పాక్ట్‌ ఉప్పల్‌లో భారీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. 

ఈ విషయాన్ని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘జెన్‌పాక్ట్‌ తమ గ్రిడ్‌ పాలసీలో భాగంగా ఉప్పల్‌లోని తమ క్యాంపస్‌ను విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే నేడు ఉప్పల్‌ క్యాంపస్‌కు భూమి పూజ జరగనుంది. దీంతో 15 వేలకుపైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయి. ఐటీ రంగంలో రానున్న రోజుల్లో హైదరాబాద్‌లో లక్ష ఉద్యోగాల కల్పనను చేరుకోనున్నాము’ అంటూ కేటీఆర్‌ ట్వీట్ చేశారు. అందులో భాగంగానే… ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఉప్పల్ క్యాంపస్‌కు భూమి పూజ చేశారు. తూర్పు ప్రాంతంలో జెన్‌పాక్ట్‌ సంస్థ 20 లక్షల చదరపు అడుగుల వాణిజ్య కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. 

హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నట్లుగా సెక్యూరిటీ కౌన్సిల్ ఈ ప్రాంతంలో ఒకటి ఏర్పాటు చేస్తామని, ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం కృషి చేస్తున్నామన్నారు. ఉప్పల్ నుండి నారపల్లి వరకు భారీ ఫ్లైఓవర్ వేస్తున్నట్లు, ఇంకా 4, 5 మంది ప్రైవేటు డెవలపర్స్ ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. వారికి కూడా అవకాశం కల్పిస్తామని హామీనిచ్చారు. ఈ ప్రాంతంలో ఐటీ విస్తరించడం ద్వారా చాలా మందికి ఉపాధి దొరుకుతుందన్నారు మంత్రి కేటీఆర్.
 

(చదవండి: ఐపీఎల్‌ చరిత్రలోనే తొలిసారి..! ప్లేయర్స్‌తో పాటుగా దీని వేలం కూడా..!)

Advertisement
Advertisement