అదానీ గ్రీన్‌లో టోటల్‌ ఎనర్జీ | Sakshi
Sakshi News home page

అదానీ గ్రీన్‌లో టోటల్‌ ఎనర్జీ

Published Thu, Sep 21 2023 5:32 AM

TotalEnergies Plans Equally Owned Joint Venture With Adani Group - Sakshi

న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్‌ దిగ్గజం అదానీ గ్రూప్‌తో ఏర్పాటు చేయనున్న శుద్ధ ఇంధన భాగస్వామ్య కంపెనీ(జేవీ)లో 30 కోట్ల డాలర్లు(రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు ఫ్రెంచ్‌ దిగ్గజం టోటల్‌ఎనర్జీస్‌ తాజాగా వెల్లడించింది. కొత్తగా నెలకొల్పనున్న జేవీలో 50 శాతం వాటాను సొంతం చేసుకోనున్నట్లు తెలియజేసింది. మిగిలిన 50 శాతం వాటాను అదానీ గ్రీన్‌ ఎనర్జీ పొందనుంది. ఈ జేవీ మొత్తం 1,050 మెగావాట్ల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండనుంది. వీటిలో 300 మెగావాట్ల సామర్థ్యం ఇప్పటికే ప్రారంభంకాగా.. 500 మె.వా నిర్మాణంలో ఉంది.

మరో 250 మె.వా సోలార్, విండ్‌ కలయికతో అభివృద్ధి దశలో ఉంది. కాగా.. యూఎస్‌ షార్ట్‌సెల్లర్‌ హిండెన్‌బర్గ్‌ ఆరోపణల తదుపరి గౌతమ్‌ అదానీ గ్రూప్‌ కంపెనీతో ఫ్రెంచ్‌ దిగ్గజం టోటల్‌ తొలిసారి పబ్లిక్‌ డీల్‌ను కుదుర్చుకోవడం గమనార్హం! శుద్ధ ఇంధన ప్రాజెక్టుల పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా టోటల్‌ తాజా పెట్టుబడులను చేపట్టింది. ఇప్పటికే అదానీ గ్రీన్‌ ఎనర్జీలో 19.7 శాతం వాటాను కలిగిన టోటల్‌.. 2,353 మె.వా. పోర్ట్‌ఫోలియోగల ఏజీఈ23ఎల్‌(జేవీ)లో అదానీ గ్రీన్‌తో సమాన వాటాను కలిగి ఉంది. ఇక 2019లోనే అదానీ టోటల్‌ గ్యాస్‌లో 37.4 శాతం వాటాను టోటల్‌ పొందింది. ఇందుకు 30 కోట్ల డాలర్లు(రూ. 2,500 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement